తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం, ఆర్టీసీ సమ్మె వాయిదా-tgsrtc union announced strike postponed after successful talks with govt ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం, ఆర్టీసీ సమ్మె వాయిదా

తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం, ఆర్టీసీ సమ్మె వాయిదా

తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.

తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం, ఆర్టీసీ సమ్మె వాయిదా

రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు ఇవాళ చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేశారు.

ఐఏఎస్ లతో కమిటీ

ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. నవీన్‌ మిత్తల్‌, లోకేశ్ కుమార్‌, కృష్ణభాస్కర్‌లతో ఏర్పడిన కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి సమస్యలకు పరిష్కారం సూచించనుంది.

వారంలోగా నివేదిక

వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఐఏఎస్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తమ డిమాండ్ల సాధన కోసం మే 7 నుంచి సమ్మె చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మే 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే, 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ వరకూ భారీ కవాతు నిర్వహించారు.

మంత్రితో చర్చలు

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా 21 సమస్యలపై ప్రభుత్వం నుంచి కార్మిక సంఘాలు స్పష్టం కోరుతున్నాయి. ఈ తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రితో చర్చించారు.

సమ్మె ఆలోచన విరమించుకో

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఆర్టీసీ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి ,వైస్ చైర్మన్ అబ్రహాం, ఇతర కార్మిక సంఘం నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలపై జేఏసీ నేతలు మంత్రికి వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.

చర్చలు సఫలం

ఆర్టీసీ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె ఆలోచనపై విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం