రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు ఇవాళ చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేశారు.
ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. నవీన్ మిత్తల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్లతో ఏర్పడిన కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి సమస్యలకు పరిష్కారం సూచించనుంది.
వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఐఏఎస్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తమ డిమాండ్ల సాధన కోసం మే 7 నుంచి సమ్మె చేయాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మే 6వ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే, 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ వరకూ భారీ కవాతు నిర్వహించారు.
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా 21 సమస్యలపై ప్రభుత్వం నుంచి కార్మిక సంఘాలు స్పష్టం కోరుతున్నాయి. ఈ తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రితో చర్చించారు.
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఆర్టీసీ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి ,వైస్ చైర్మన్ అబ్రహాం, ఇతర కార్మిక సంఘం నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలపై జేఏసీ నేతలు మంత్రికి వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సమ్మె ఆలోచనపై విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు.
సంబంధిత కథనం