TG Registrations : ఇక 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి, ఏప్రిల్ 10 నుంచి స్లాట్ బుకింగ్ - మంత్రి పొంగులేటి-tg registration closing in 10 to 15 minutes slot booking opens april 10th minister ponguleti statement ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Registrations : ఇక 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి, ఏప్రిల్ 10 నుంచి స్లాట్ బుకింగ్ - మంత్రి పొంగులేటి

TG Registrations : ఇక 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి, ఏప్రిల్ 10 నుంచి స్లాట్ బుకింగ్ - మంత్రి పొంగులేటి

TG Registrations : రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంది. ఏప్రిల్ 10 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి రానుంది. దీంతో 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.

ఇక 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి, ఏప్రిల్ 10 నుంచి స్లాట్ బుకింగ్ - మంత్రి పొంగులేటి

TG Registrations : తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రాన్ ఆఫీసులను ఆధునీకరించాలని నిర్ణయించింది. ప్రజలకు వేగవంతంగా సేవలను అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 'స్లాట్‌ బుకింగ్' విధానాన్ని అందుబాటులో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్‌ 10 నుంచి రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ముందుగా 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. స్లాట్‌ బుకింగ్‌తో 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుందని తెలిపారు. తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ https://registration.telangana.gov.in/ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.

22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్థవంతంగా సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించే ప‌నిలేకుండా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నామ‌ని మంగ‌ళవారం విడుద‌ల చేసిన ఓ ప్రక‌ట‌న‌లో వెల్లడించారు. రాష్ట్రంలో 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు గాను మొద‌టి ద‌శ‌లో ప్రయోగాత్మకంగా 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లులోకి తీసుకురాబోతున్నామ‌ని ప్రక‌టించారు.

హైద‌రాబాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, స‌రూర్ న‌గ‌ర్‌, చంపాపేట్, పెద్దప‌ల్లి జిల్లా రామగుండం, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (R.O), మేడ్చల్ (R.O), మహబూబ్ నగర్(R.O), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ మొత్తం 22 చోట్ల ఈ కార్యక్రమానికి శ్రీ‌కారం చుడుతున్నామ‌ని తెలిపారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వలన జరిగే జప్యాన్ని నివారించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించామన్నారు. ప్రజలు నేరుగా “registration.telangana.gov.in” వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నారు. స్లాట్ బుక్ చేసుకోనివారికోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తార‌ని, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తార‌ని తెలిపారు.

అధిక రద్దీ కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకం

పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి, 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామ‌ని, ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్భందిని నియమించామని, దీనివ‌ల‌న కుత్బుల్లాపూర్ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.

స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను రీఆర్గనైజేష‌న్ చేస్తున్నామ‌ని, ఇందులో భాగంగా అధిక ర‌ద్దీ, త‌క్కువ ర‌ద్దీ ఉన్న స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల ప‌రిధిని అనుసంధానం చేసి ప‌నిభారాన్ని స‌మానం చేయ‌డానికి చ‌ర్యలు తీసుకుంటామన్నారు. ఈ విధానాన్ని ముందుగా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట – సరూర్ నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు.

దస్తావేజులను స్వయంగా తయారు చేసుకోవ‌చ్చు

రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్ సైట్ లో ఒక మాడ్యూల్ ని ప్రవేశపెట్టామ‌న్నారు. మొద‌ట‌గా సేల్ డీడ్ ద‌స్తావేజుల కోసమే ఈ సౌక‌ర్యం ఉంటుంద‌ని, ఇది కూడా ఐచ్చిక‌మేన‌ని తెలిపారు.

"రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజు పైన అమ్మినవాళ్ళు, కొన్నవాళ్లు, సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా/భౌతికంగా సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వలన దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీని వలన ప్రజల సమయం వృధా అవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ-సంతకం ప్రవేశపెడుతున్నాం. ఈనెల చివ‌రిలోగా ఇ-సైన్ అందుబాటులోకి తీసుకువ‌స్తాం" - మంత్రి పొంగులేటి

డ‌బుల్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ

ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మా ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింద‌నే ఫిర్యాదులు ప్రజల నుండి ఎక్కువగా వస్తున్నాయ‌ని, డబుల్ రిజిస్ట్రేషన్ లను నివారించడానికి చ‌ట్టాన్ని స‌వ‌రించ‌బోతున్నామ‌ని తెలిపారు. డబుల్ రిజిస్ట్రేష‌న్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాలు ఇప్పటికే చ‌ట్టాల‌ను స‌వ‌రించుకున్నాయ‌ని, అదేవిధంగా తెలంగాణ‌లో కూడా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయ‌డానికి చ‌ర్యలు తీసుకుంటున్నామన్నారు. రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా సెక్షన్స్ 22 కి సవరణ చేస్తూ సెక్షన్ 22-బి తీసుకువస్తామని తెలిపారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం