High Court On Theatres : సినిమా థియేటర్లకు 16 ఏళ్ల లోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. సరైన సమయం లేకుండా... పిల్లలు థియేటర్లకు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం....16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లకు తగిన సమయాల్లోనే అనుమతించాలని ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోల అంశం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెనిఫిట్ షోలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వటంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రకటించిన తర్వాత కూడా ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వటం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునసమీక్షించాలని హైకోర్టు ఆదేశించింది.
భారీ బడ్జెట్తో సినిమాలు తీసిన నిర్మాతలు ప్రేక్షకుల నుంచి డబ్బును వసూలు చేయాలనుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట, బెనిఫిట్ షోలకు అనుమతిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.