తప్పుడు పత్రాలతో అఫిడవిట్, గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు జరిమానా- చట్టపరమైన చర్యలకు ఆదేశాలు-tg high court fines group 1 candidates filed petition with false documents order for legal action ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తప్పుడు పత్రాలతో అఫిడవిట్, గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు జరిమానా- చట్టపరమైన చర్యలకు ఆదేశాలు

తప్పుడు పత్రాలతో అఫిడవిట్, గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు జరిమానా- చట్టపరమైన చర్యలకు ఆదేశాలు

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం సరిగ్గా జరగలేదని 19 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తప్పుడు పత్రాలతోత పిటిషన్ దాఖలు చేసినట్లు వీరికి హైకోర్టు రూ.20 వేలు చొప్పున జరిమానా విధించింది. మరోవైపు సింగిల్ బెంచ్ ఆదేశాలపై టీజీపీఎస్సీ అప్పీలకు వెళ్లింది.

తప్పుడు పత్రాలతో అఫిడవిట్, గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు జరిమానా- చట్టపరమైన చర్యలకు ఆదేశాలు

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని మొత్తం 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెమోకు, వెబ్ సైట్ లోని మార్కులకు తేడాలున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే తప్పుడు ప్రమాణ పత్రాలతో పిటిషన్‌లు దాఖలు చేసినట్లు గుర్తించిన హైకోర్టు గ్రూప్‌ -1 అభ్యర్థులకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

తప్పుడు అఫిడమిట్

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలు రీవాల్యుయేషన్‌ చేసి మార్కులు పారదర్శకంగా వెల్లడించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్లు తప్పుడు పత్రాలు దాఖలు చేశారని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. టీజీపీఎస్సీ దాఖలు చేసిన ప్రాథమిక వివరాలను పరిశీలించిన కోర్టు.. అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చారని గుర్చించింది.

వాస్తవాలను దాచిపెట్టి హైకోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇచ్చింది.

గ్రూప్-1 నియామకాలు తాత్కాలికంగా నిలిపివేత

తెలంగాణ గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం గ్రూప్-1 నియామకాలపై తాత్కాలికంగా స్టే విధించింది. ఈ ఉత్తర్వులను టీజీపీఎస్సీ సవాల్ చేస్తూ అప్పీలు దాఖలు చేసింది. ఈ పటిషన్ పై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.

గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు సింగిల్ బెంచ్ ధర్మాసనం.. నియామకాలు తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సీజే ధర్మాసనంలో సవాల్

మెయిన్స్ ఆన్సర్ షీట్స్ పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సీజే ధర్మాసనం ఎదుట టీజీపీఎస్సీ పిటిషన్‌ దాఖలు చేసింది. సీజే ధర్మాసనంలో అప్పీలు చేసినట్లు టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్‌కు తెలిపారు. ఈ అంశంపై సోమవారం విచారణ జరగాల్సిన విచారణను జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు వాదనలను బుధవారానికి వాయిదా వేశారు. పిటినషనర్లు తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తించిన హైకోర్టు జరిమానా విధించడంతో...మంగళవారం విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.