TG Mlc Election Nominations : ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలు, తొలి రోజు 9 మంది నామినేషన్ లు దాఖలు
TG Mlc Election Nominations : ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
TG Mlc Election Nominations : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. టీచర్స్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తో పాటు తొమ్మిది మంది 13 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 8, 9 తేదీల్లో నామినేషన్లకు సెలవు ఉంటుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు.

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. కరీంనగర్ కలెక్టరేట్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నామినేషన్లు స్వీకరిస్తున్నారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కరీంనగర్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు.
తొలి రోజు 9 మంది అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు, టీచర్స్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానానికి రెండిట్లోనూ నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు.
ఈనెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ
షెడ్యూల్ ప్రకారం ఈనెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉండడం వల్ల ఆ రెండు రోజులు నామినేషన్లు స్వీకరించడం జరగదని తెలిపారు. ఇక మిగతా రోజుల్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన,13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
మార్చి 3 న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సందేహాలను నివృత్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హెల్ప్ డేస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి తూ.చ తప్పకుండా పాటించాలని ,ర్యాలీలు, సమావేశాలు, సభలు తదితర వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థి ఇటు గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు రెండు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన దూడ మహిపాల్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గవ్వల లక్ష్మి, మేడ్చల్ కు చెందిన కంటే సాయన్న గ్రాడ్యుయేట్ స్థానానికి ఒక్కొక్క సెట్ నామినేషన్ వేశారు. హైదరాబాద్ కు చెందిన చాలిక చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్ స్థానానికి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అదిలాబాద్ కు చెందిన మంచికట్ల ఆశమ్మ ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు.
టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు
టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామినేషన్ దాఖలు చేశారు. చాలిక చంద్రశేఖర్ ఒక సెట్ నామినేషన్, సిలివేరు శ్రీకాంత్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయా అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి నామినేషన్లను స్వీకరించారు. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కలెక్టర్ పమేలా సత్పతితో పాటు డీఆర్ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ ఆర్డిఓ కే మహేశ్వర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
పెరిగిన ఓటర్లు
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఓటర్ల సంఖ్య పెరిగింది. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 లక్షల 59వేల 614 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఇక టీచర్స్ ఓటర్లు 28672 మంది ఉన్నారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకునేలా పట్టభద్రుల కోసం 499 పోలింగ్ కేంద్రాలు, టీచర్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు