Russia Ukraine Crisis | భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ విడిచి రావాలి!
రష్యా- ఉక్రెయిన్ మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. ఉక్రెయిన్ లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తాత్కాలికంగా స్వదేశానికి తరలిరావాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు మంగళవారం మరోసారి ప్రకటన విడుదల చేసింది.
New Delhi | ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. ఉక్రెయిన్ లో చదువుతున్న భారతీయ విద్యార్థులు తాత్కాలికంగా స్వదేశానికి తరలిరావాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు మంగళవారం మరోసారి ప్రకటన విడుదల చేసింది.
ట్రెండింగ్ వార్తలు
" విద్యార్థుల క్షేమం దృష్ట్యా వారు వెంటనే స్వదేశం రావాలని కోరుతున్నాము. మీ యూనివర్శిటీల నుంచి అధికార ప్రకటన వచ్చేంత వరకు వేచిచూడకుండా తాత్కాలికంగా ఉక్రెయిన్ విడిచి రావాలని సూచిస్తున్నాం" అని భారత ఎంబసీ ఈరోజు ప్రకటన విడుదల చేసింది.
విద్యార్థుల పేరేంట్స్ నుంచి తమకు పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఉక్రెయిన్లోని వివిధ యూనివర్శిటీల్లో చదివే వారి విద్యార్థులను స్వదేశం రప్పించి ఆన్లైన్ తరగతులు నిర్వహించే ఏర్పాట్లు చేయడం గురించి అడుగుతున్నారని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విషయమై తాము ఇప్పటికే ఉక్రేనియన్ అధికారులతో చర్చిస్తున్నట్లు భారత ఎంబసీ స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ సంక్షోభం పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు సలహాలు- సూచనలు చేస్తోంది. ఇదివరకే ఒకసారి ఫిబ్రవరి 15న మన దేశం వారిని స్వదేశం రావాలని కోరింది. అత్యవసరమయితే తప్ప అక్కడ ఉండకూడదని తెలిపింది. ఈ క్రమంలో మంగళవారం మరోసారి ప్రకటన చేసింది.
అయినప్పటికీ భారత ఎంబసీ అధికారులు అక్కడే ఉండి తమ విధులు నిర్వర్తిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం ఇప్పటికీ పని చేస్తూనే ఉంది, అక్కడి తాజా పరిణామాలను గమనిస్తుందని సమాచారం ఉంది.
ఉక్రెయిన్లో సుమారు 20 వేల మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అధికారులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉన్నారు. వీరి క్షేమం తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశం అని భారత్ పదేపదే చెబుతోంది. ఈ మేరకు అక్కడ ఉండే భారత పౌరుల సహాయార్థం ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్లో గల ఇండియన్ ఎంబసీ కార్యాలయంలోనూ అలగే దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
ఉక్రెయిన్పై దాడి జరుగుతుందనే భయాందోళనల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారత పౌరుల తరలింపు ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఈరోజు ఉదయం 7:40 గంటలకు ఎయిర్ ఇండియా మొదటి ప్రత్యేక విమానం ఉక్రెయిన్కు బయలుదేరింది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఫిబ్రవరి 22, 24, 26 తేదీలలో కీవ్- న్యూఢిల్లీ మార్గంలో మూడు ప్రత్యేక విమానాలను నడపనుంది.
సంబంధిత కథనం