TS TET Results 2023: నేడు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
TS TET Results 2023: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
TS TET Results 2023: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 10గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు.
ఫలితాలు తమ అధికారిక వెబ్సైట్ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 15న టెట్ పరీక్ష నిర్వహించగా పేపర్-1కు 2.26 లక్షలు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. ఇప్పటికే టెట్ ప్రాథమిక కీ విడుదల చేశారు. ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం చేశారు.
తెలంగాణ టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులవుతారు. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు. తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది. జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణలో సెప్టెంబర్ 15న టెట్ పేపర్1, పేపర్2 పరీక్షలను నిర్వహించారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు ముందే ప్రకటించారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 1,82,260 దరఖాస్తులు వచ్చాయని ప్రకటించారు.
స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు
తెలంగాణ ఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మల్టీ జోన్-1లో 19 జిల్లాల్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, మల్టీ జోన్-2లో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని వారికే బదిలీలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది.
అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 28, 29వ తేదీల్లో తమకు కావాల్సిన పాఠశాలలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 30న వివరాలను సవరించుకోవడానికి అవకాశం ఇచ్చారు. స్పౌజ్ పాయింట్లు వినియోగించుకుంటున్న వారు తమ భార్య లేదా భర్త పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గర్లోని పాఠశాలలను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల పేర్కొన్న వివరాలను పరిశీలించిన తర్వాత డీఈఓలు బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన మంగళవారం ఆదేశించారు.