వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఈనెల 17న ‘రైల్ రోకో’ ఆందోళన చేపట్టనున్నట్ట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనికి సంబంధించిన బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అయితే కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కవిత కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పెండింగ్లో ఉండటంపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలంగాణ శాసనసభ ఈ ఏడాది మార్చి 17న రెండు బిల్లులను ఆమోదించింది. వీటి ప్రకారం, విద్యా సంస్థలలో, ఉద్యోగాలలో, అలాగే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుల కారణంగా రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని మించిపోతుంది కాబట్టి కేంద్రం అనుమతి అవసరం.
"రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలలో (ఓబీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఇప్పుడు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది" అని బీఆర్ఎస్ నాయకురాలు కవిత అన్నారు.
ఈ బిల్లును ఆమోదించేలా చూడాలని అధికార బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆమె కోరారు. "బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది.. నేను ప్రధానమంత్రిని కోరుతున్నా.. ఆయన ఓబీసీ వర్గానికి చెందినవారు. దయచేసి ఈ బిల్లును వీలైనంత త్వరగా తిరిగి పంపేలా చూడాలి" అని ఆమె అన్నారు.
తమిళనాడు మోడల్ను అనుసరించవచ్చని, బిల్లు ఆమోదించిన తర్వాత ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కవిత సూచించారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో కేంద్ర, రాష్ట్ర చట్టాల జాబితా ఉంటుంది. వీటిని కోర్టులలో సవాలు చేయలేరు.
పార్లమెంటు చట్టం ద్వారా లేదా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని కవిత అభిప్రాయపడ్డారు.