MLC Election Counting : టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కౌంట్ డౌన్, మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు-telangana mlc election vote counting countdown begins mock count performed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Election Counting : టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కౌంట్ డౌన్, మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు

MLC Election Counting : టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కౌంట్ డౌన్, మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు

HT Telugu Desk HT Telugu

MLC Election Counting : రేపు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మాక్ కౌంటింగ్ నిర్వహించారు. పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు కరీంనగర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కౌంట్ డౌన్, మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు

MLC Election Counting : ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే కౌంటింగ్ కోసం ఏర్పాట్లన్ని పూర్తి చేసి, మాక్ కౌంటింగ్ నిర్వహించారు. ఉత్తర తెలంగాణలోని పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల, టీచర్స్ నియోజకవర్గ స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి మాక్ కౌంటింగ్ నిర్వహించారు.‌ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఓట్లను కరీంనగర్ లోని అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో లెక్కిస్తారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపుకు 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్ల ఏర్పాటు చేశారు.

మొత్తం 35 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. ఒక్కో టేబుల్‌ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్‌, ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. వారందరికీ సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు.

పొరపాట్లకు తావు లేకుండా...

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా మాక్ కౌంటింగ్ నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ఆధ్వర్యంలో కౌంటింగ్ లో పాల్గొనే సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించేలా కౌంటింగ్ సెంటర్ లో మాక్ కౌంటింగ్ నిర్వహించారు. మాక్ కౌంటింగ్ ద్వారా ఎటువంటి పొరపాట్లకు, తప్పిదాలకు, ఆస్కారం లేకుండా కౌంటింగ్ సజావుగా సాగుతుందన్నారు.

కౌంటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణలో ఇచ్చిన ఆదేశాలను, సూచనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆదేశించారు.

మూడంచెల భద్రత...

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రం కరీంనగర్ ఇండోర్ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. సెంట్రల్, స్టేట్, స్థానిక పోలీసులతో మూడంచేల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరాయంగా కొనసాగనున్నది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండగా, పూర్తయ్యే సరికి సుదీర్ఘ సమయం తీసుకోనున్న నేపథ్యంలో మూడు షిప్టుల్లో లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు.

రాత్రి వరకు టీచర్స్ ఫలితం...పట్టభద్రుల ఫలితానికి రెండు మూడు రోజులు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తయ్య అవకాశం ఉంది. కానీ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.‌ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీ చేయక 27088 మంది ఓటర్లకు గాను 24968 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఆ ఓట్ల లెక్కింపు 12 గంటల్లో పూర్తయ్యె అవకాశం ఉంది.‌ ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేశారు.‌ 3 లక్షల 55 వేల 159 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 2 లక్షల 50 వేల 328 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడం పోలింగ్ శాతం పెరగడంతో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుందని అధికారులు అంచనా వేశారు.

చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతం ప్లస్ ఒకటి వస్తేనే విజేత...

సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందుగా కోటాను నిర్దారించాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి, చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. మొత్తం చెల్లబాటయ్యే ఓట్లలో 50 శాతం లెక్కకడతారు.

50 శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువుగా సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా ఓట్లను కట్టలుకడతారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల కోసం ఒక్కోక్కరికి ఒక డబ్బా కేటాయించి వారు పొందిన ఓట్లను ఆ డబ్బాల్లో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కగడతారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థికి 50 శాతం కంటే ఎక్కువ ఓట్ల కోటాను చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు.

ఎలిమినేషన్ ఎలా చేస్తారంటే...

ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. వాటిని పైనున్న అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఒక అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కోటా ఓట్లు ఎవరికి రాకపోతే మరో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ.. కోటా ఓట్లు వచ్చే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తారు. ఎప్పుడైతే విజయానికి అవసరమైన కోటా ఓట్లు అభ్యర్థి సాధిస్తారో అప్పుడు అతడిని విజేతగా ప్రకటిస్తారు. పట్టభద్రుల ఓట్లు లక్షల్లో ఉండటం ద్వారా వాటి లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుంది. టీచర్స్ ఓట్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తవుతుంది..

రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం