తెలంగాణ ప్రభుత్వం అనధికార లేఅవుట్లకు రెగ్యులరైజేషన్ కు ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాయితీతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది. మార్చి 31వ తేదీతోనే గడవు ముగియగా… ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించింది. అయితే ఈ గడువు కూడా దగ్గరపడింది. మరో మూడు రోజుల్లో ఈ అవకాశం ముగియనున్న నేపథ్యంలో… దరఖాస్తుదారులు వెంటనే ఫీజులు చెల్లించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏప్రిల్ 30 లోగా ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ అవకాశం ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత అలాంటి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించగా.. మరోసారి పెంచే అవకాశం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఏప్రిల్ 30 లోపు ఫీజు చెల్లించుకోవాలని… మరోసారి గడువు పెంచే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు.
లే అవుట్ల రెగ్యులరేషన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా రూ.వెయ్యి కోట్ల పైగా ఆదాయం సమకూరింది. ఈ పథకం ద్వారా అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించనున్నారు. ఇప్పటికే పరిశీలించిన దరఖాస్తులను క్లియర్ చేశారు. అర్హత ఉన్న వారికి ప్రోసిడింగ్స్ కాపీలను కూడా అందజేశారు.ఎల్ 1, ఎల్2, ఎల్ 3 దశల్లో పరిశీలన పూర్తి అయిన వాటికి మాత్రమే ప్రోసిడింగ్ కాపీలను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పురపాలక శాఖ జారీ చేసిన జీవో 28 ప్రకారం ఏప్రిల్ 30 లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ పొందవచ్చు. 26 ఆగస్టు 2020కు ముందు అక్రమ లేఅవుట్లను ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరిస్తారు. లేఅవుట్లోని ప్లాట్లలో కనీసం 10 శాతం ఇప్పటికే విక్రయించాలి. ఇప్పటికే రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారు అర్హులు.
ఇక దరఖాస్తుదారులు తమ దరఖాస్తు వివరాలు మర్చిపోతే...దరఖాస్తు వివరాలు తిరిగి పొందడానికి 'యూనివర్సల్ సెర్చ్' ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ తో దరఖాస్తు రసీదులను తప్పుగా ఉంచిన లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను మార్పు వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. యూనివర్సల్ సెర్చ్ ఆప్షన్ ద్వారా నిర్దిష్ట వివరాలను నమోదు చేసి అప్లికేషన్ నంబర్, ఇతర సంబంధిత సమాచారం వివరాలను తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం