నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు - జిగేల్ మంటున్న ‘వరంగల్ కోట’-telangana is set to host the 72nd miss world competition beginning today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు - జిగేల్ మంటున్న ‘వరంగల్ కోట’

నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు - జిగేల్ మంటున్న ‘వరంగల్ కోట’

HT Telugu Desk HT Telugu

మిస్‌ వరల్డ్‌ పోటీలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ ఘనంగా ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈ నెల 14న మిస్‌ వరల్డ్ ప్రతినిధుల టీమ్ వరంగల్ నగరంలో సందడి చేయనుంది.

నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు

మిస్‌ వరల్డ్‌ పోటీలు షురూ కానున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానున్నాయి.ఈ వేడుకలకు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. మే 31 వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా…. తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రమోట్ చేసే దిశగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

మరోవైపు ప్రపంచ అందగత్తెల పోటీల హాజరయ్యే అతివల రాక కోసం వరంగల్ కోట ముస్తాబవుతోంది. ఈ నెల 14న మిస్‌ వరల్డ్ ప్రతినిధుల టీమ్ వరంగల్ కు రానుండగా.. వారి సందర్శనార్థం కాకతీయుల రాజధానిగా వెలుగొందిన వరంగల్ కోటను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లోనే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ కు రానుండగా.. గ్రేటర్ వరంగల్ కమిషన్ అశ్వినీ తానాజీ వాకడే దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కోట చుట్టూ లైటింగ్…..

మిస్ట్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు ఈ నెల 14న వరంగల్ నగరానికి రానుండగా, మొదట వాళ్లంతా హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ కు చేరుకుంటారు. వారికి అక్కడ తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలు, ఇతర ఆటపాటలు, కళా ప్రదర్శనలతో స్వాగతం పలుకుతారు. అనంతరం హనుమకొండ వేయి స్తంభాల గుడిని సందర్శించి, ఆ తరువాత అక్కడి నుంచి నేరుగా వరంగల్ కోటకు చేరుకుంటారు. కాగా వారి సందర్శన కోసం వరంగల్ కోటను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు.

కోట చుట్టూ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. కోటతో పాటు ఖుష్ మహాల్ వద్ద జిగేల్ మనేలా లైట్లు అమర్చి, ప్రపంచ దేశాల నుంచి వచ్చే ముద్దు గుమ్మలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కోటలో నాలుగు వైపులా ఉన్న నాలుగు కళా తోరణాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కలర్ ఫుల్ లైట్లు అమర్చుతున్నారు.

ఈ మేరకు ఏర్పాట్లను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే శుక్రవారం సాయంత్రం వరంగల్ కోటను సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై స్థానిక గైడ్ రవి యాదవ్, పురావస్తు శాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్ ఛార్జ్ అజయ్, ఎన్పీడీసీఎల్ కు చెందిన ఏఈలు, డీఈలు అక్కడ జరుగుతున్న పనుల గురించి, గ్రేటర్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడేకు వివరించారు. దీంతో ఏర్పాట్లపై గ్రేటర్ కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

టూరిజాన్ని ప్రమోట్ చేసేలా..

ప్రపంచ అందగత్తెల పోటీల కోసం దాదాపు 144 దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు తరలిరానుండగా, తెలంగాణ టూరిజాన్ని వారికి ప్రమోట్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రపంచ అందగత్తెల కోసం హిస్టారికల్, టూరిస్ట్ స్పాట్ల విజిట్ ను ప్లాన్ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సందర్శించేలా ప్రోగ్రామ్ డిజైన్ చేయగా.. వరంగల్ లో కాకతీయుల పాలనకు కేంద్రమైన వరంగల్ కోటను టూర్ జాబితాలో చేర్చింది. దీంతో వారిని ఆకట్టుకునేలా అధికారులు ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు.

ముస్తాబవుతున్న వేయి స్తంభాల గుడి, రామప్ప..

ఓ వైపు వరంగల్ కోట మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందర్శనకు రెడీ అవుతుండగా.. మరోవైపు హనుమకొండలోని వేయి స్తంభాల గుడి వద్ద కూడా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. దాదాపు 30 మంది అందగత్తెల టీమ్ రానుండగా, వారికి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మహిళా పోలీస్ సిబ్బందికి విధులు కేటాయించారు.

మరోవైపు రామప్ప ఆలయాన్ని కూడా మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనుండగా, అక్కడ వారం నుంచే పనులు ప్రారంభించారు. ఆలయాన్ని ముస్తాబు చేయడంతో పాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మరో నాలుగు రోజుల్లోనే ప్రపంచ అందగత్తెలు ఓరుగల్లు గడ్డపై అడుగు పెట్టనుండగా, వారి రాక కోసం ఇక్కడి అధికారులు పకడ్బందీగా వసతులు కల్పించడంపై ఫోకస్ పెట్టారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

సంబంధిత కథనం