MLAs Poaching Case: BL సంతోష్ అరెస్ట్ అంశంపై హైకోర్టు ఆదేశాలు - స్టేకు నిరాకరణ
TS High Court On MLAs Poaching Case: బీఎల్ సంతోష్, శ్రీనివాస్లకు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సిట్ విచారణ వేగవంతం చేస్తున్న క్రమంలో.. అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు... తాజాగా బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ నెల 21న హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. రాకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే బీఎల్ సంతోష్, శ్రీనివాస్లకు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పైనా హైకోర్టు శనివారం విచారించింది. సిట్ నోటీసులు రద్దు చేయాలన్న బీజేపీ విజ్ఞప్తిని నిరాకరించింది. ఇదే సమయంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సంతోష్ను అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
సిట్ హౌస్ మోషన్ పిటిషన్...
మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు శనివారం మధ్యాహ్నం విచారణ జరిపింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి నేరుగా నోటీసులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు అనుమతించడం లేదని సిట్ పిటిషన్ వేసింది. విచారణకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తునకు అంతరాయం కలిగించొద్దని ఢిల్లీ సీపీని ఆదేశించాలని ఉన్నత న్యాయస్థానాన్ని సిట్ కోరింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు సహకరించాలని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
నోటీసుల్లో గందరగోళం..!
మరోవైపు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసుల్లో గందరగోళం నెలకొంది. ఒకే నంబర్, ఒకే ఐఎంఈఐ నంబర్ ఉన్న ఫోన్ తేవాలని బీఎల్ సంతోష్, కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇద్దరికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న మొబైల్ నంబర్, అందుకు సంబంధించిన ఐఎంఈఐ నంబర్లు ఒకే విధంగా ఉండటంతో గందరగోళానికి దారి తీసింది. నోటీసులు జారీ చేసే క్రమంలో కాపీ పేస్ట్ చేస్తుండగా పొరపాటు జరిగిందా.. లేదా దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నంబర్ ఎవరి దగ్గర ఉందో తేల్చుకోవడానికే అలా నోటీసులు పంపించారా అనేదానిపై స్పష్టత కూడా రావాల్సి ఉంది. దీనిపై పోలీసుల నుంచి వివరణ రావాల్సి ఉంది.