Telangana High Court: చిన్నారి మృతి కదిలించలేదా? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న-telangana high court key comments on ghmc after stray dogs maul 4 year old to death ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana High Court Key Comments On Ghmc After Stray Dogs Maul 4 Year-old To Death

Telangana High Court: చిన్నారి మృతి కదిలించలేదా? ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 06:33 AM IST

four year old boy in an attack by stray dogs case: వీధి కుక్కుల బెడదపై ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించి తెలంగాణ హైకోర్టు. అంబర్ పేట ఘటనను సుమోటోగా స్వీకరించి విచారించిన న్యాయస్థానం... పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు (tshc.in)

High Court On Street Dogs Killed Boy Case: అంబర్‌పేటలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనపై హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషులపై వీధి కుక్కలు దాడులు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ జీహెచ్‌ఎంసీని ధర్మాసనం ప్రశ్నించింది. చిన్నారి మృతి మిమ్మల్ని కదిలించలేదా అని సూటిగా ప్రశ్నించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణకు మీ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా? అని నిలదీసింది. ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లిదండ్రులు పరిహారం పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. . పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

నగరంలోని అంబర్‌పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్‌ మృతి చెందిన ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరపగా...కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. వీధి కుక్కల బెడద నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని... అందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలి స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు.. మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

అంబర్ పేట ఘటన.. ఏం జరిగిందంటే..?

Street Dogs Killed young Boy: నాలుగేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ చిన్నారి చనిపోయాడు. హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌లతో కలిసి బాగ్‌అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నాడు.

ఆదివారం సెలవు కావడంతో గంగాధర్‌ పిల్లలిద్దర్నీ వెంట బెట్టుకుని తాను పని చేస్తున్న సర్వీస్‌ సెంటర్‌‌కు వచ్చాడు. కుమార్తెను పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్‌మన్‌తో కలిసి పని మీద బయటకు వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్‌, తర్వాత అక్క కోసం క్యాబిన్‌ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి.

భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటూ పరుగులు తీసినా అవి వదల్లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడిచేశాయి. ఒక దశలో ఓ కుక్క కాలు..మరొకటి చేయి నోటకరచుకుని చెరోవైపు లాగడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చిన ఆరేళ్ల సోదరి.. పరుగున వెళ్లి తండ్రికి సమాచారమిచ్చింది. గంగాధర్ వచ్చి అదిలించడంతో కుక్కలు బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో కుక్కల బెడదపై సర్కార్ దృష్టిసారించింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం