కాళేశ్వరం నివేదిక : ‘ఎలాంటి చర్యలు తీసుకోవద్దు’ - హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు ఊరట-telangana high court grants relief to ias officer smitha sabarwal from action in kaleshwaram case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కాళేశ్వరం నివేదిక : ‘ఎలాంటి చర్యలు తీసుకోవద్దు’ - హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు ఊరట

కాళేశ్వరం నివేదిక : ‘ఎలాంటి చర్యలు తీసుకోవద్దు’ - హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు ఊరట

కాళేశ్వరం విచారణ కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

తెలంగాణ హైకోర్టు

కాళేశ్వరం కేసులో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తనపై చర్యలు తీసుకోవద్దంటూ సీనియర్ ఐఎస్ఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారించిన న్యాయస్థానం… జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

చర్యలు వద్దు - హైకోర్టు ఆదేశాలు

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. నివేదిక ఆధారంగా ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటికే ఈ కేసులో కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషిలకు కూడా ఈ కేసులో హైకోర్టులో ఊరట దక్కిన సంగతి తెలిసిందే.

నిర్మాణ ప్రాంతాలను సందర్శించడం, క్షేత్ర తనిఖీలు, అప్పటి ముఖ్యమంత్రికి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం, పరిపాలనా అనుమతులు ఇవ్వడంలో ప్రమేయం వంటి వాటిని ఉదహరిస్తూ బ్యారేజీల అమలులో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కీలకమైన ఫైళ్లను క్యాబినెట్ ముందు ఉంచకపోవడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది.

నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్‌ చేసిన స్మితా సబర్వాల్… తనకు సంబంధించినంత వరకు నివేదికను కొట్టివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లోని సెక్షన్ 8-బి మరియు 8-సి కింద తప్పనిసరి రక్షణలను పాటించకుండా కమిషన్ తనపై "తీవ్రమైన మరియు ప్రతికూల వ్యాఖ్యలు" చేసిందని సబర్వాల్ తన పిటిషన్ లో ప్రస్తావించారు.

బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో తాను భాగం కాదని… అనుమతులు మంజూరు చేయడంలో ఎటువంటి పాత్ర లేదని స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం