TGPSC Group 1 Prelims 2024 : ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగనుంది. గత అనుభవాల దృష్ట్యా… ఈసారి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలను చేపట్టారు. పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో ఈసారి పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతా కూడా ఉదయం 10 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సీబీఆర్టీ విధానంలో కాకుండా…. ఓఎంఆర్(OMR) పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే కమిషన్ ప్రకటన కూడా చేసింది. ఈసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక చర్యలు చేపట్టింది. అభ్యర్థులకు ఇవాళ రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాలిచ్చింది.
రాజధాని హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే అభ్యర్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున.. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్లలో తగు ఏర్పాట్లును సంస్థ చేసింది. ఆయా ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచే పనిలో పడింది.
రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో 'May I Help You' కౌంటర్లను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెప్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది విద్యార్థులు గ్రూప్-1 ప్రిలిమినరీకి హాజరవుతుండగా.. అందులో గ్రేటర్ హైదరాబాద్లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నారు. వారికీ రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచడం జరిగిందని ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.