TG Group1: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సోమవారం ఉదయం సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. అభ్యర్థుల ఆందోళనలు, జీవో 29పై నిరసనలు, విపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయని తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు నిర్వహణకే మొగ్గు చూపుతోంది. నేటి నుంచి ఈ నెల 27 వరకు మెయిన్స్ పరీక్షలు కొనసాగనున్నాయి.
సోమవారం మధ్యాహ్నం 2గంటల నుంచి ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. మంగళవారం నుంచి వరుసగా సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ రిజర్వేషన్ విధానంపై ఇప్పటికే పెద్ద ఎత్తున అభ్యతంరాలు వ్యక్తం అవుతున్నాయి. తగినంత గడువు లేదని అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరుగుతాయి. గతంలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల పేపర్ లీక్ కావడంతో వాటిని రద్దు చేశారు. దాాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ పరీక్షలు జరుగుతుండగా వాటిపై కూడా అభ్యర్థులె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా లాఠీఛార్జీ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
గ్రూప్1 పరీక్షల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. పరీక్ష గది, చీఫ్ సూపరిం టెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నప క్షేత్రాలు, జవాబు పత్రాలను తరలించే జీపీఎస్ అమర్చిన వాహనాలు నిర్దేశిత మార్గాల్లో ప్రయాణించేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షలకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ గ్రూప్ 1మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. హైదరాబాద్లోనే 46 పరీక్షా కేంద్రాలు ఏఱ్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ జిల్లాలో 27 ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణను ఆయా జిల్లా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షించనున్నారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలే ఏర్పాటు చేసి వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. అభ్యర్థులు పరీక్ష మొదలు కావడానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్నం 12.30 నుంచి 1.30గంట వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. 1.30 తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే 040-23452185, 040-23452186, 040-23452187నంబర్లలో సంప్రదించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు గంట సమయం అదనంగా కేటాయిస్తారు. సహాయకుల సాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు. మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు అన్ని పరీక్షలూ రాయాల్సి ఉంటుంది.
జనరల్ ఇంగ్లీషు (క్వాలిఫై టెస్ట్) 21-10-2024 సోమవారం
పేపర్-1 జనరల్ ఎస్సే 22-10-2024 మంగళవారం
పేపర్-2 చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం 23-10-2024 బుధవారం
పేపర్-3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పాలన 24-10-2024 గురువారం
పేపర్-4 ఆర్థిక శాస్త్రం, అభివృద్ధి 25-10-2024 శుక్రవారం
పేపర్-5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ 26-10-2024 శనివారం
పేపర్-6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 27-10-2024 ఆదివారం