Rythu Bandhu 2023: ఈసారి మరింత ముందుగానే 'రైతుబంధు'.. డబ్బుల జమ ఎప్పుడంటే?
Rythu Bandhu Scheme Updates:వర్షాకాలం సీజన్ కు సంబంధించిన రైతుబంధు నిధులు ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. జూన్ నెలలోనే జమ చేయాలని భావిస్తోంది.
Rythu Bandhu Scheme Funds: వానకాలం సీజన్ వచ్చేస్తోంది. దీంతో రైతుబంధు నిధుల జమపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఈసారి ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చూస్తోంది. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా రైతులకు ముందుగానే రైతు బంధు నిధులు జమ చేసి తీపి కబురు అందించాలని సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే... జూన్ నెలలోనే నిధులు జమ అయ్యే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
వానకాలం సీజన్ కు సంబంధించి జూన్ చివర్లో లేదా జూలై మాసంలో నిధులను జమ చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. ఈసారి గతానికి భిన్నంగా... ముందుగానే ఈ వర్షాకాలం సీజన్ కు సంబంధించిన రైతు బంధు పెట్టుబడి సాయన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పంట సీజన్ల ను ముందుకు జరపాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. తద్వారా... అన్నదాతలను కూడా పంట సాగుకు సిద్ధం చేయవచ్చని కూడా సర్కార్ భావిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా...ఈసారి సాగు ముందుకు జరపాలని సర్కార్ పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే.
జూన్ రెండో వారంలోనే..!
ఈసారి రైతుబంధు నిధులను జూన్ రెండో వారం లేదా మూడో వారంలో విడుదల చేయవచ్చని సమాచారం. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేపుమాపో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
రైతు బంధు పథకం కింద ప్రతీ ఎకరానికి వానాకాలం, యాసంగి సీజన్లో రూ.5 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం 63లక్షలకు పైగా రైతులకు ఈ సాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనుంది సర్కార్. వారికి కూడా ఇదే ఏడాది నుంచే రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు పోడు భూముల పట్టాలు పొందే ప్రతి లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించనుంది. సంబంధిత రైతు బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్, లబ్ధిదారుడి మొబైల్ నంబర్ తదితర వివరాలను అప్లోడ్ చే సేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది పోడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచేపనిలో పడ్డారు.
పోడు భూములు లబ్ధిదారులు కాకుండా… ఇతర వ్యవసాయదారులు.. తమ పాస్ బుక్, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా పాస్ బుక్ తదితర పత్రాలతో సంబంధిత గ్రామ వ్యవసాయ అధికారిని గానీ, మండల రెవెన్యూ అధికారిని గానీ సంప్రదించి రైతుబంధు, రైతుబీమా దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ పథకం కింద లబ్ధి పొందిన రైతుల్లో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకం ప్రారంభమైన అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఇదే తరహాలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాయి.
సంబంధిత కథనం