పెద్దపల్లి జిల్లాలో ఎయిర్‌ పోర్ట్.. అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం రూ.40.53 లక్షలు మంజూరు!-telangana govt sanctions above 40 lakhs for pre feasibility study of anthergoan airport in peddapalli ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  పెద్దపల్లి జిల్లాలో ఎయిర్‌ పోర్ట్.. అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం రూ.40.53 లక్షలు మంజూరు!

పెద్దపల్లి జిల్లాలో ఎయిర్‌ పోర్ట్.. అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం రూ.40.53 లక్షలు మంజూరు!

Anand Sai HT Telugu

పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఎయిర్ పోర్ట్ కల సాకారం అయ్యేందుకు మరో కీలక అడుగు పడింది. అంతర్గాం మండల కేంద్రానికి దగ్గరలో విమానాశ్రయం ఏర్పాటుపై పరిశీలన జరగనుంది.

ప్రతీకాత్మక చిత్రం

పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్‌ ఎయిర్ పోర్ట్ విషయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక విషయం తెలిపింది. ఇక్కడ ఎయిర్ పోర్ట్ నిర్మించడం వీలుకాదని వెల్లడించింది. దీంతో ప్రత్యామ్నాయంగా జిల్లాలోని అంతర్గాంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాల కోసం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ ఫీల్డ్ విమానాశ్రయం అధ్యయనం చేయడానికి రూ.40.53 లక్షలను విడుదల చేసింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు విమానాశ్రయం ఏర్పాటుపై రిపోర్ట్ తయారు చేసిన సమర్పించనున్నారు. అక్టోబర్ 11, 2025న జారీ చేసిన GO Rt. నం. 465 ప్రకారం, ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కన్సల్టెంట్‌గా నియమించారు. 18 శాతం జీఎస్టీతో సహా కన్సల్టెన్సీ రుసుము రూ.40,52,946గా నిర్ణయించారు.

డిసెంబర్ 31, 2025 వరకు ఈ ఫీజు రేట్లు వర్తిస్తాయని న్యూఢిల్లీలోని ఏఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్కిటెక్చర్) గతంలో తెలియజేశారు. దీని తర్వాత ఆర్థిక శాఖ 2025–26 సంవత్సరానికి అదనపు నిధులుగా అవసరమైన మొత్తాన్ని విడుదల చేసింది. వాయు రవాణాను పెంపొందించడానికి తెలంగాణ అంతటా ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

నిజానికి బసంతనగర్ వద్ద పాత రన్ వే దగ్గర విమానాశ్రయం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఆ ప్రాంతానికి ఇరుపులా గుట్టలు, హైటెన్షన్ వైర్లు ఉండటంతో అనుకూలం కాదని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండిడా భావించింది. ఈ మేరకు భూ భాగం, టెక్నాలజీ, ఆర్థికంగా అనుకూలం కాదని నివేదిక సమర్పించింది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండల కేంద్రానికి దగ్గరలో 591.24 ఎకరాల స్థలాన్ని ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కేటాయించింది.

ఈ ఎయిర్‌పోర్టు ద్వారా పెద్దపల్లి ప్రజలకు, సింగరేణి సిబ్బందికి, విద్యార్థులు, వ్యాపార వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. హైదరాబాద్‌కు గంటల కొద్దీ ప్రయాణం చేసే అవసరం ఉండదు. ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడుతుంది. అనేక అవకాశాలు లభిస్తాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.