Y Category Security To KCR: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తొలిరోజు నుంచే ఆ దిశగా అడుగులు వేస్తున్న సర్కార్… తాజాగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భద్రత విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్కు భద్రత కుదించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ‘జెడ్ ప్లస్’ కేటగిరిలో ఉన్న కేసీఆర్ భద్రతను ‘వై’ కేటగిరీకి కుదించారు. 4+4 గన్మెన్లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని మాత్రమే కేసీఆర్ భద్రత కోసం కేటాయించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది.
మరోవైపు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత విషయంలోనూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. వారికి ఉండే గన్ మెన్లను తొలగించాలని ఆదేశించింది. దీంతో వారి గన్ మెన్స్ ను పోలీస్ శాఖ విత్ డ్రా చేసుకుంది. ఎవరెవరికి గన్ మెన్స్ అవసరమనే దానిపై త్వరలోనే ఇంటెలీజెన్స్ అధికారులు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వారికి మాత్రమే గన్ మెన్స్ ను కేటాయించనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులకు మాత్రం 2+2 గన్మెన్లను ఉంచి ఎమ్మెల్యేగా లేని వారికి గన్మెన్లను పూర్తిగా తొలగించారు. ఇక మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు ఉన్న గన్మెన్లను తొలగించారు. కార్పొరేషన్ ఛైర్మన్లకు కేటాయించిన గన్ మెన్లను కూడా తొలగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గన్ మెన్లు రిపోర్టు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందికిపైగా గన్ మెన్లు రిపోర్టు చేసినట్లు తెలుస్తోంది. రేపోమాపో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.