TS Govt On Land Regularisation: రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి స్థలాల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. గతంలో జారీ చేసిన 58, 59 జీఓల కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇందుకోసం మరో నెలరోజుల పాటు గడువు పొడిగించింది. అంతేకాదు కటాఫ్ తేదీని కూడా పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.,నెల రోజలు అవకాశం...పట్టణాల్లోని భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు 30 రోజులు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సింగరేణి పరిధిలో దరఖాస్తులకు 3 నెలలు అవకాశం ఇచ్చింది. సింగరేణి పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూములు ఆక్రమించుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.,ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చే ఆస్తుల్లో, ఎలాంటి అభ్యంతరాలు లేని చోట నిరుపేదలు తలదాచుకోడానికి నిర్మించుకున్న ఈ నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన 2014, జూన్ 02ను ఇందుకు కటాఫ్ తేదీగా నిర్ణయించారు. అయితే ఈ తేదీని తాజాగా మారుస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. కటాఫ్ తేదీని ఆరేండ్లు పొడిగించాలని నిర్ణయించింది. ఫలితంగా 2014 జూన్ 2 నుంచి 2020 జూన్ 2వ తేదీకి మార్చింది. వివిధ కారణాల వల్ల కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారని గుర్తించిన ప్రభుత్వం.. గత ఏడాది ఫిబ్రవరిలో మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నది. దరఖాస్తు గడువు, కటాఫ్ తేదీ పెంపుతో లక్షల మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం దక్కనుంది.,ప్రభుత్వం ప్రకటించిన క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా... 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నవారికి ఉచితంగా క్రమబద్ధీకరణ అవుతుంది. ఇక 126 నుంచి 250 చదరపు గజాల వరకు ఆక్రమించినవా రు భూమి మార్కెట్ ధరలో 50 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 251 నుంచి 500 చదరపు గజాల వరకు విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకున్నవారు మార్కెట్ ధరలో 75 శాతం ఫీజు చెల్లించాలి. 500 నుంచి 1000 గజాల వరకు ఉంటే ప్రభుత్వ ధరను వంద శాతం చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి మీ -సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నివాసానికి సంబంధించిన పలు ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆర్డీవో చైర్మన్గా, తహసిల్దార్ సభ్యులుగా ఉండే కమిటీ ఈ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటుంది.,