తెలంగాణలో మరో రెండు దగ్గు మందులు కూడా బ్యాన్.. ఇష్టం వచ్చినట్టుగా వాడొద్దు.. పిల్లలకు ప్రమాదం!-telangana govt banned another two cough syrups and suggestions on syrup using to kids ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో మరో రెండు దగ్గు మందులు కూడా బ్యాన్.. ఇష్టం వచ్చినట్టుగా వాడొద్దు.. పిల్లలకు ప్రమాదం!

తెలంగాణలో మరో రెండు దగ్గు మందులు కూడా బ్యాన్.. ఇష్టం వచ్చినట్టుగా వాడొద్దు.. పిల్లలకు ప్రమాదం!

Anand Sai HT Telugu

తెలంగాణలో మరో రెండు దగ్గు మందులు బ్యాన్ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.

తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం

పిల్లలకు దగ్గు మందు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు దగ్గ మందులపై రాష్ట్రంలో నిషేధం విధించింది. ఇటీవలే కోల్డ్ రిఫ్‌ను పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రిలీఫ్, రెస్పీ ఫ్రెష్-టీఆర్ సిరప్‌లపై నిషేధం విధించింది. ఈ రెండింటిలోనూ కల్తీ జరిగిందని తేలడంతో విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవి గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా పేర్కొన్నారు అధికారులు.

దగ్గు మందుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్యం విభాగం హెచ్చరించింది. తగిన నివారణ చర్యలతో పిల్లలకు వచ్చిన దగ్గు, జలుబును కట్టడి చేయవచ్చని తెలిపింది. వెంటనే తగ్గిపోవాలని ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడితే పిల్లల ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది. రెండు సంవత్సరాలలోపు పిల్లలలకు దగ్గు మందు ఇవ్వకూడదని సూచించింది. ఐదేళ్లలలోపు చిన్నారులకు కూడా అత్యవసరం అయితేనే ఇవ్వాలని తెలిపింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తీసుకున్న కారణంగా 10 మందికి పైగా చిన్నారులను ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అప్రమత్తమైంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ కలుషితం ఉన్న SR-13 బ్యాచ్ సిరప్‌ను ఉపయోగించకూడదని మెున్న హెచ్చరించింది.

కోల్డ్‌రిఫ్ సిరప్ (బ్యాచ్ నం. SR-13) వాడకాన్ని ప్రజలు ఆపేయాలని డీసీఏ నోటీసు ఇచ్చింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో శ్రేసన్ ఫార్మా తయారు చేసిన ఈ సిరప్‌లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరణానికి కారణమయ్యే విషపూరిత రసాయనమైన డైథిలిన్ గ్లైకాల్ (DEG) కల్తీ ఉన్నట్లు డీసీఏ తెలిపింది. ప్రజలు వెంటనే ఈ సిరప్ వాడకాన్ని నిలిపివేయాలని, ఏదైనా సిరప్ కలిగి ఉంటే స్థానిక డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు నివేదించాలని సూచించింది. పౌరులు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల మధ్య అన్ని పని దినాలలో అందుబాటులో ఉన్న టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా డీసీఏని కూడా సంప్రదించవచ్చు. సిరప్ గురించి సమాచారం ఇవ్వాలని కూడా చెప్పింది.

తెలంగాణ డీసీఏ అధికారులు తమిళనాడు డీసీఏ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభావిత దగ్గు సిరప్ బ్యాచ్ పంపిణీని పర్యవేక్షించారు. అన్ని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు రిటైలర్లు.. టోకు వ్యాపారులు, ఆసుపత్రులను ప్రస్తుత నిల్వలను అలాగే ఆపేయాలన్నారు అధికారులు. ఈ ప్రత్యేక బ్యాచ్‌కు చెందిన దగ్గు సిరప్‌లను సీజ్ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.