తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఏప్రిల్ 30తో పదవీ వివరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఎస్ ను నియమించింది.
ప్రస్తుతం కె.రామకృష్ణారావు ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కొత్త సీఎస్ నియామకంపై గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
సీఎస్ ఎంపికలో సీనియారిటీ జాబితా ప్రకారం రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారుల పేర్లను పరిశీలించారు. సీనియారిటీ, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని రామకృష్ణారావును సీఎస్గా నియమించింది.
రామకృష్ణారావు 2014 నుంచి ఆర్థికశాఖలో కీలకంగా ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా రామకృష్ణారావు అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. రామకృష్ణారావును సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1న ఆయన సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావును నియమితులయ్యారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంటర్ సెక్రటరీగా నియమించింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. దీంతో స్మితా సబర్వాల్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్వార్ జరిగింది.
ఈ పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ ను ప్రాధాన్యం లేని శాఖను కేటాయిస్తారని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం కీలకమైన ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ను నియమించింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
సంబంధిత కథనం