తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో యాసంగి సీజన్ రైతు భరోసా సాయాన్ని అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందించగా, ఆపైన భూమి ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ గత రెండు నెలల కిందటి నుంచే ప్రారంభమైంది. ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి. త్వరలోనే 4 ఎకరాలు, ఆ పైన ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయనున్నారు. దీనికి రూ.4 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని పంపిణీ చేస్తే యాసంగి రైతు భరోసా పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రానున్న జూన్ లేదా జులై నెలలోనే మళ్లీ వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులకు అందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం దాదాపు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.
యాసంగి సీజన్ పూర్తయినప్పటికీ ఇంకా రైతు భరోసా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల కారణంగా 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేశారు. పెండింగ్ లో ఉన్న యాసంగి రైతు భరోసా డబ్బులను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మే రెండో వారంలోగా ప్రతి రైతుకు రైతు భరోసా అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పలు కీలక ప్రాజెక్టులకు, పథకాల అమలుకు నిధుల సర్దుబాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రానున్న మూడు నెలల్లో కనీసం రూ.35 వేల కోట్ల మేర నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం పథకానికి సంబంధించి ఆర్థిక శాఖ నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. దీంతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇచ్చే నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం సంప్రదింపులు జరుపుతోంది. అలాగే ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిరుపేదలకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించేందుకు రూ. 12,571 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి కేంద్రం నుంచి పీఎంఏవై పథకం కింద రూ.4,600 కోట్లు రానున్నాయి. ఈ పథకానికి కొంత రుణాన్ని ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చుకుంది. ఈ పథకం ద్వారా 70,122 మంది లబ్ధిదారులను తొలివిడతలో ఇండ్లను మంజూరు చేశారు. దాదాపు 14 వేల ఇందిరమ్మ ఇండ్ల పునాది పనులు ప్రారంభం అయ్యాయి. బెస్మెంట్ పూర్తైన ఇండ్లకు నగదు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ యువతకు రూ.2.40 లక్షల వరకు సబ్సిడీతో రుణాలు అందించేందుకు రూ. 6 వేల కోట్ల ఇవ్వాలని నిర్ణయించింది. జూన్ 2 తర్వాత నుంచి ఈ రుణాలు పంపిణీ చేయనున్నారు.