రాష్ట్రంలో కొత్త స్టాంప్ విధానం తీసుకురావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఆ దిశగా కసరత్తును చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే బిల్లును తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే సంస్కరణలో భాగంగా…. మహిళలకు స్టాంప్ డ్యూటి తగ్గించే ప్రతిపాదనను కూడా సర్కార్ పరిశీలిస్తోంది. పాత అపార్ట్ మెంట్లకు స్టాంప్ డ్యూటి వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. సీఎం ఆమోదం తర్వాత…. అధికారికంగా ప్రకటన వెలువుడే అవకాశం ఉంది.
కొత్త స్టాంప్ విధానం కసరత్తుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం కీలక ప్రకటన చేశారు. భారతీయ స్టాంపు చట్టం 1899ను అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు-2025ను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు.
ఈ సవరణ బిల్లుపై సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి. ఎస్. లోకేష్ కుమార్, న్యాయవ్యవహారాల కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, ముఖ్యమంత్రి కార్యాలయ ఒఎస్డి వేముల శ్రీనివాస్ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2021లో చేసిన సవరణ బిల్లుపై చర్చించారు. ఈ బిల్లులను కేంద్రం వెనక్కి తిరిగి పంపటానికి గల కారణాలపై కూడా ఆరా తీశారు.
ఆ తర్వాత మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… 2021లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఉపసంహరించుకొని ప్రస్తుత కాలానికి అనుగుణంగా 2025 సవరణ బిల్లును తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని సవరణ బిల్లును తీసుకువస్తామని చెప్పారు. పాత చట్టంలో లేనివాటిని కొత్త చట్టం పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని సూచించారు.
సామాన్య మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా శాస్త్రీయ పద్దతిలో భూముల ధరల సవరణ జరగాలన్నారు. ఏఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది అక్కడ హేతబద్దంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం ఎన్నో చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. దీనిలో భాగంగా మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. అలాగే కొత్త, పాత అపార్ట్మెంట్ లకు స్టాంప్ డ్యూటీ ఒకే విధంగా ఉందన్నారు. అయితే పాత అపార్ట్ మెంట్లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణనలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నామని వివరించారు. ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించి విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.