తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'యాసంగిలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయ్యింది. 60.14 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు అయ్యింది. 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశాం. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 2023 రబీ సీజన్ లో మే15 నాటికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈ రబీ సీజన్ లో అదే మే 15 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశాం' అని మంత్రి ఉత్తమ్ వివరించారు.
'ముందెన్నడూ లేని రీతిలోపెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. యాసంగి ధాన్యం కొనుగోలకు 8,348 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. 2021-22 రబీ సీజన్తో పోలిస్తే.. ఈ రబీ సీజన్లో అధికంగా 1,739 కేంద్రాలకు అవకాశం ఇచ్చాం. ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరగడంతో.. కొనుగోలు కేంద్రాలను పెంచాం. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తాం. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
'రైతుల అభీష్టానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలి. రానున్న 10,12 రోజులు కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో లోపాలు గుర్తించి సత్వరమే పరిష్కరించాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. నిజానిజాలు ప్రజలకు బహిర్గతం చేసి రైతులకు భరోసా కల్పించడంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలి' అని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
అటు సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వానకాలం పంటలకు సన్నద్ధమవ్వాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
సంబంధిత కథనం