‘ఏఐ పవర్డ్ తెలంగాణ’ పేరిట ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యం, హైదరాబాద్ నగర నిర్వహణ, విద్యా రంగాల్లో సమూల మార్పులు తేవడానికి ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కార్యాచరణను ఆవిష్కరించింది.
ఏఐ రంగంలో పెట్టుబడులు, హైదరాబాద్ నగర నిర్వహణలో ఏఐ వినియోగం, ఏఐ రంగంలో ఔత్సాహికుల ప్రోత్సాహం, పాఠశాల దశలో విద్యార్థులకు ఏఐలో శిక్షణ కోసం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మంగళవారం ఎక్స్లో పంచుకున్నారు.
ఇప్పటిదాకా కుదుర్చుకున్న ఒప్పందాలు, అమల్లోకి తెచ్చిన ఏఐ ఆధారిత సేవలను తెలుపుతూ ఏఐ రంగంలో తెలంగాణ దేశంలోనే ముందువరుసలో ఉందని హర్షం వ్యక్తం చేశారు. వివిధ సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, అమల్లోకి తెచ్చిన ఏఐ సాంకేతికత వివరాలు ఇలా ఉన్నాయి.
గూగుల్ 4 స్టార్టప్ సెంటర్ : దేశంలోని తొలి “Google 4 Startup Centre”ని తెలంగాణలో ఏర్పాటు చేసి, ఏఐ ఆధారిత స్టార్టప్లకు మెంటరింగ్, నిధుల సహాయం అందిస్తుంది. అలాగే గూగుల్తో ఎంవోయూ ద్వారా వ్యవసాయం, మొబిలిటీ, వర్క్ఫోర్స్ స్కిల్లింగ్లో పైలట్ ప్రాజెక్టులకు సహకరిస్తుంది.
CDAC, Yotta, WTC ఒప్పందాలు: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA).. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC), డేటా సెంటర్ ఆపరేటర్ యోట్టా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ (WTC)తో ఏఐ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఏఐ సిటీ: హైదరాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీ నిర్మాణం జరగనుంది. దీనిని స్మార్ట్ సిటీల ఏర్పాటుకై ఉన్న సమస్యలను పరిష్కరించే వేదికగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ట్రాఫిక్ పరిష్కారాలు: గూగుల్ గ్రీన్లైట్ ప్రాజెక్ట్లో భాగమైన “Road Management Solution”ను రియల్-టైమ్ డేటా ఆధారంగా సిగ్నల్ టైమింగ్ ఆప్టిమైజ్ చేసి, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టారు.
ఏడీఈఎస్ : భారతదేశంలోనే తొలి సమగ్ర వ్యవసాయ డేటా ప్లాట్ఫాం ADEX ఏర్పాటు గేమ్ ఛేంజర్గా నిలువనుంది. ఇది పంట, నేల, వాతావరణ డేటాను సేకరించి దిగుబడి అంచనా, పెస్ట్ మేనేజ్మెంట్, వనరుల ఆప్టిమైజేషన్ కోసం ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తుంది. హెచ్డీఎఫ్సీ వంటి ప్రముఖ బ్యాంకులు ఏడీఈఎక్స్ డేటాను ఉపయోగించి వేగవంతమైన, డేటా ఆధారిత రణాలను అందిస్తాయి.
స్వదేశీ హెల్త్కేర్ ఏఐ మోడల్: ఐఐఐటీ, ఐఐటీ-హైదరాబాద్, బిట్స్ పిలానీ-హైదరాబాద్, NALSAR, ISB వంటి సంస్థలు కలసి సొంత AI డయాగ్నోస్టిక్ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఫార్మా దిగ్గజాలు AIG, ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యం కొనసాగించి డ్రగ్ డిస్కవరీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత రోగి సంరక్షణను వేగవంతం చేయనున్నాయి.
VISWAM ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ : VISWAM సెంటర్ ద్వారా కళాశాల విద్యార్థులకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో లక్ష మందికి ఏఐలో ఇంటర్న్షిప్ కల్పించనున్నారు.
పాఠశాలల్లో ఏఐ : 2025 విద్యా సంవత్సరం నుంచి ఏఐ కాన్సెప్ట్లను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చనున్నారు. మైక్రోసాఫ్ట్తో ఒక ప్రత్యేక ఒప్పందం ద్వారా తెలంగాణలోని 500 పాఠశాలలకు ఏఐ-ఆధారిత బోధన, అభ్యాస సాధనాలను అందిస్తారు.
MITRA-TG యాప్: రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన MITRA-TG మొబైల్ యాప్ విద్యార్థుల్లో మాదకద్రవ్యాలను వినియోగించే ప్రమాదం ఉంటే దాన్ని ముందుగానే ఏఐ అల్గారిథమ్ల ద్వారా గుర్తించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను హెచ్చరిస్తుంది. '
ఈ ప్లాట్ఫాం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పిల్లల ప్రవర్తనను పర్యవేక్షించడానికి, ప్రమాదంలో ఉన్న వారిని కౌన్సెలర్లతో అనుసంధానించడానికి డైరెక్ట్ హెల్ప్లైన్ను అందిస్తుంది.
సంబంధిత కథనం