TS DOST Notification 2024 Updates: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం ‘దోస్త్’(TS DOST 2024) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఉస్మానియా వర్శిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో దోస్త్(Degree Online Services Telangana) రిజిస్ట్రేషన్ల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం మూడు విడతల్లో సీట్ల భర్తీని పూర్తి చేయనున్నారు.
మొత్తం 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు రూ.200 చెల్లించాలి. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 6వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. అర్హత గల విద్యార్థులు మే 25వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఫస్ట్ ఫేజ్ సీట్లను జూన్ 3వ తేదీన కేటాయిస్తారు. జూన్ 10వ తేదీలోపు ఆయా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి. ఇక రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.