ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆన్ లైన్ న్యూస్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్ హరీష్కు విజ్ఞప్తి లేఖను అందజేశారు. ఆన్లైన్ మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుపుతూ పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ఐ అండ్ పీఆర్ (IPR Department) కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు TDMJA (Telangana Digital Media Journalist Association) ప్రతినిధులు చెప్పారు. త్వరలోనే ఆన్లైన్ మీడియా(వెబ్సైట్, యాప్)కు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రక్రియ షురూ చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు.ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తామని చెప్పారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకుడు స్వామి ముద్దం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా డిజిటల్ మీడియా రంగం కీలక పాత్ర వహిస్తుందన్నారు. ఈ కొత్త మాధ్యమంలో అనేక మంది జర్నలిస్టులు పని చేస్తున్నారని గుర్తు చేశారు.
ఆన్లైన్ న్యూస్ మీడియాకు గుర్తింపును ఇస్తూ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి సహకరించాలన్నారు. ఇదే విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించటం సంతోషకరమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ న్యూస్ మీడియాకు కూడా ఆక్రిడిటేషన్లు ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
సంబంధిత కథనం