Telangana Congress: పాదయాత్రకు ప్లాన్ జరుగుతోందా..?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హస్తినలో ఉన్నారు. గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మక్కాం వేసిన ఆయన… పార్టీ అగ్రనేతలతో కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో భారీగా ప్రక్షాళన ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana Congress Latest News: తెలంగాణ పాలిటిక్స్ ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు మారింది. పలువురు కీలక నేతలు కూడా పార్టీలు మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాస్త సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మక్కాం వేయటం ఆసక్తిని రేపుతోంది. తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్య నేతల రాజీనామాలు, అసంతృప్తుల నేపథ్యంలో రేవంత్ టూర్ పై అనేక విశ్లేషణలు వస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
పీసీసీ కార్యవర్గం, డీసీసీల మార్పులుపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈసారి జంబో కార్యవర్గం ఉండటంతో పాటు ప్రధాన కార్యదర్శలను పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన కార్యదర్శలకు నియోజవర్గాల బాధ్యతలను అప్పగించే అవకాశాలపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో...చేపట్టాల్సిన చర్యలపై కూడా కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పలువురు ముఖ్యనేతలు కూడా పార్టీని వీడటంపై కూడా అధినాయకత్వం ఆరా తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా రేవంత్ ఓ నివేదికను కూడా సమర్పించినట్లు సమాచారం.
ఇదే సమయంలో జోడో యాత్ర మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బస్సుయాత్ర చేయాలా లేక పాదయాత్ర చేయాలా? ఎవరు చేస్తే బాగుంటుంది..? అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి లేదా భట్టి ఈ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే డిసెంబర్ చివర్లో యాత్ర షురూ అవుతుందని అంచనా. పాదయాత్రకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యాత్ర అంశంపై ఆ పార్టీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు వచ్చే నెలలో పార్టీ స్టీరింగ్ కమిటీ భేటీ కూడా జరగనుంది. మల్లికార్జున ఖర్గే సారథ్యంలో తొలిసారిగా ఈ స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ప్లీనరీ ఏర్పాటు, భారత్ జోడో యాత్ర వంటి అంశాలను ప్రస్తావనకు రానున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న తెలంగాణలో రాజకీయ స్థితిగతులపైనా మల్లికార్జున ఖర్గే ఆరా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్తో అనుసరించాల్సిన వైఖరి, ఇతర వ్యూహాలు, తదితర అంశాలు వారిద్దరి మధ్య చర్చకు రావొచ్చని తెలుస్తోంది. ఇదే భేటీలో రాష్ట్రంలో చేపట్టాల్సిన యాత్రపై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.