Telangana Cabinet : ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు..!
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహుర్తం ఫిక్స్ అయింది. ఈనెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. హైడ్రాకు చట్టబద్ధత, రైతు భరోసా, రుణమాఫీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
ఈనెల 23వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ప్రకటన జారీ చేశారు.
మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ అధికారాలు ఇటీవలనే హైడ్రాకు కట్టబెడుతూ పురపాలకశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ చట్ట సవరణ బిల్లుపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక వచ్చే అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు చర్చించే అంశాలపై కూడా సమాలోచనలు చేయనున్నారు. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులతో పాటు కుల గణన వంటి అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది..!
మూసీ ప్రక్షాళనపై కీలక చర్చ..!
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళలను సీరియస్ గా తీసుకుంది. పరివాహన ప్రాంతంలో ఉన్న నిర్వాసితులకు ఇళ్లను కేటాయించే పనిలో పడింది. ఇప్పటికే చాలా ఇళ్లకు మార్కింగ్ కూడా చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా మూసీ సుందరీకరణను తీసుకుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో ఈ విషయంపై లోతుగా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రంలో చాలా మంది రైతులు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం తీసుకొచ్చిన రైతు భరోసా స్కీమ్ పై కేబినెట్ చర్చించనుంది. విధివిధానాలను ఖరారు చేసే అంశంపై సమాలోచనలు చేయనుంది. ఇక రుణమాఫీ స్కీమ్ కూడా చర్చకు రానుంది. ఈ నెలాఖారులోపు మిగిలిపోయిన రైతులకు కూడా రుణమాఫీ స్కీమ్ వర్తింపజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది.