TG Cabinet: 42శాతం బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ క్యాబినెట్ అమోదం.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రెడీ-telangana cabinet approves 42 percent bc reservation supreme court verdict on sc classification ready to be implemente ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Cabinet: 42శాతం బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ క్యాబినెట్ అమోదం.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రెడీ

TG Cabinet: 42శాతం బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ క్యాబినెట్ అమోదం.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రెడీ

Sarath Chandra.B HT Telugu

TG Cabinet: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. రీజినల్ రింగ్‌ రోడ్డు బఫర్‌ పరిధి విస్తరణతో పాటు పలు కీలక అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్‌లో కీలక నిర్ణయం

TG Cabinet: తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణ యించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ అక్తర్ ఇచ్చిన సవరణ నివేదికకు మంత్రి మండలి అమోదం తెలిపింది.

మంత్రి వర్గ నిర్ణయాలు ఇవే…

  • గురువారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) వివరాలు నమోదు చేసుకోవడానికి రెండోసారి ఇచ్చిన గడువు పూర్తయిన నేపథ్యంలో ఆ వివరాలను మంత్రిమండలి సమగ్రంగా చర్చించింది.
  • ఎస్సీ వర్గీకరణపై వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని మరోసారి అధ్యయనం చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికను మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎస్సీ వర్గీకరణపై భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
  • ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (#FCDA) కి ఆమోదం. శ్రీశైలం హైవేకు నాగార్జునసాగర్ హైవే మధ్య ప్రాంతంలో ఓఆర్ఆర్ వెలుపలి నుంచి ఆర్ఆర్ఆర్ బయట 2 కిలోమీటర్ల ప్రాంతం వరకు దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ విస్తరించి ఉంటుంది.
  • ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారికీ కిందకు బదిలీ చేస్తూ తీర్మానించారు. ఫ్యూచర్ సిటీ మొత్తంగా 7 మండలాలు, 56 గ్రామాలతో విస్తరించి ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 90 పోస్టులను మంజూరు చేస్తూ ఆమోదించింది.
  • హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్ అవతల 2 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏను విస్తరించారు. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి.
  • మహిళా సాధికారతకు పట్టం కడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025 కు కేబినెట్ ఆమోదం. గ్రామాల్లో సెర్ప్ కింద, పట్టణాల్లో మెప్మాగా విడిపోయి ఉన్న మహిళా సంఘాలు ఇకనుంచి ఒకే గొడుకు కింద తెస్తూ తీర్మానం చేశారు. ః
  • మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసును 18 ఏండ్ల నుంచి 15 ఏండ్లకు కుదింపు. అలాగే సంఘాల్లో కొనసాగడానికి గరిష్ట వయసును 60 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచారు.
  • తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటుకు వీలుగా దేవాదాయ చట్టంలో సవరణలు చేశారు.
  • 2025 - 2030 మధ్య ఐదేళ్లకు గాను టూరిజం పాలసీకి ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో గుర్తించిన 27 ప్రాంతాలను ప్రత్యేక టూరిస్టు కేంద్రాలుగా తీర్చిదిద్దడం. ఆ ప్రాంతాల అభివృద్ధి చేయడంలో 15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులను రాబట్టేలా పాలసీకి రూపకల్పన చేశారు. .
  • మే నెలలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 2024 పారా ఒలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయించింది.
  • తెలంగాణలో 10,954 గ్రామాలకు రెవెన్యూ అధికారుల నియమాకం చేపడతారు. పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయించారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 361 పోస్టులకు అనుమతి. అలాగే, గురుకులాలకు మరో 330 పోస్టుల భర్తీకి అనుమతించారు.
  • యాదాద్రి భువనగిరి జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీ నుంచి 1.28 టీఎంసీకి తగ్గించాలని నిర్ణయించారు.
  • లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి గారి నాయకత్వంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని తీర్మానం చేశారు. పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరక్కుండా ఉద్దేశంతో అఖిల పక్ష సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించారు.
  • ఎస్సీ వర్గీకరణకు అమోదం..

తెలంగాణలో ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని సీఎం తెలిపారు. ఈ మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో కమిషన్ నియమించగా.. ఫిబ్రవరి 3న నివేదిక ఇచ్చిందని వివరించారు. ఈ నివేదికలోని సిఫార్సులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించామన్నారు. కమిషన్‌ నివేదికను పునః పరిశీలించాలని వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయని వాటిని పరిశీలించి సవరణ నివేదిక ఇవ్వాలని కమిషను ప్రభుత్వం కోరిందని వివరించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చట్టం తీసుకువచ్చేందుకు.. సవరణ నివేదికను కమిషన్ ఇచ్చింది. దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.

బీసీ రిజర్వేషన్లు పెంపు…

బీసీ కులగణన, రిజర్వేషన్ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. బీసీల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచేం దుకు ముసాయిదా బిల్లు మంత్రివర్గం ముందుకు వచ్చింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలకు వేర్వేరు బిల్లులు తీసుకువచ్చి.. తీర్మానం చేయాలని నిర్ణయించాం. గతంలో బీసీ రిజర్వేషన్లను 31 శాతానికి పెంచుతూ కేంద్రానికి పంపించిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోనున్నారు.

ఒక తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు మరో తీర్మానం చేయడం కుదరనందువల్ల ఇందుకు నిర్ణయించినట్టు చెప్పారు ప్రభుత్వం చెప్పినట్లు బలహీనవర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా చట్టాన్ని తీసుకువచ్చి. అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందన్నారు.

బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనిపై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానం చేసినట్టు వివరించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం