మీకో దండం, మీ పార్టీకో దండం.. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా-telangana bjp mla raja singh resigns from party amid leadership tussle know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మీకో దండం, మీ పార్టీకో దండం.. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా

మీకో దండం, మీ పార్టీకో దండం.. బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా

Anand Sai HT Telugu

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు వివాదానికి కారణమవుతున్నాయి. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేస్తు్న్నట్టుగా ప్రకటించారు.

ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌గు గురిచేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై రాజాసింగ్ ఉదయం నుంచి అసంతృప్తిగానే ఉన్నారు.

నావాడు, నీవాడు అంటూ నియమిస్తే.. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తాను నామినేషన్ వేయడానికి వెళ్లినట్టుగా చెప్పారు. దరఖాస్తు కూడా తీసుకున్నాను అని, జాతియ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారని వెల్లడించారు. పార్టీలో ఉంటారా, సస్పెండ్ చేయాలా అని హెచ్చరించారన్నారు. తన దరఖాస్తుపై ముగ్గురు సభ్యులు సంతకం చేశారని, మరో ఏడుగురి సంతకం కావాల్సి ఉందని, అందుకే నామినేషన్ వేయలేదన్నారు.

'కిషన్ రెడ్డి రాజీనామా లేఖ ఇచ్చి ఆమోదించాలని కోరాను. రాజాసింగ్ మా ఎమ్మెల్యే కాదు.. సస్పెండ్ చేయాలని స్పీకర్ చెప్పాలని కిషన్ రెడ్డి చెప్పాను. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. పార్టీ అధికారంలోకి రావొద్దనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. బీజేపీ కోసం సర్వం ధారపోశాను. పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం? అందుకే రాజీనామా చేస్తున్నా. మీకో దండం, మీ పార్టీకో దండం.' అని రాజాసింగ్ అన్నారు.

బీజేపీకి రాజీనామా చేసినా హిందూత్వం కోసం పోరాడుతూనే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. మెుత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి బయటకు వచ్చేలా చేసింది. ఆయన తదుపరి కార్యాచరణ ఏముంటుందో తెలియాల్సి ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.