Telangana Assembly : డిసెంబర్లో శాసనసభ సమావేశాలు
Telangana Assembly Sessions : డిసెంబర్లో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి.. చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.
డిసెంబర్లో శాసనసభ సమావేశాలు(Assembly Sessions) జరగనున్నాయి. 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఇటువంటి చర్యలతో తెలంగాణ(Telangana) అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్(December) నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ట్రెండింగ్ వార్తలు
ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్ఆర్ బీఎం(FRBM) పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్ఆర్ బీఎం పరిమితిని 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిని అనుసరించి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను రూపొందించుకుంది. కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్ఆర్ బీఎం పరిమితిని 39 వేల కోట్లకు కుదించిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన 15 వేల కోట్ల నిధులు తగ్గాయని అంటోంది. ఆర్థికంగా పటిష్టంగా వున్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్ఆర్ బీఎం పరిమితి ఉంటుందని చెబుతోంది.
ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా చేస్తోందని టీఆర్ఎస్(TRS) ఆరోపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటేనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే వ్యవసాయ వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి కేంద్రం బలవంత పెట్టిందని పేర్కొంది.
రాష్ట్రానికి రావాల్సిన 20 వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా రాకుండా కేంద్రం నిలిపివేయించిందని రాష్ట్ర ప్రభుత్వం(State Govt) అంటోంది. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 40 వేల కోట్లకు పైగా నిధులు రాకుండా పోయాయని విమర్శిస్తోంది. కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నా... నిధులను కక్షసాధింపు నిబంధనలతో రాకుండా కేంద్రం నిలిపివేయించిందని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
కేంద్రం అనాలోచితమైన, అసంబద్ధ నిర్ణయాలతో తెలంగాణ(Telangana) ప్రగతిని మాత్రమే కాదని దేశ ఆర్థిక పరిస్థితిని కూడా కేంద్రం దిగజారుస్తోందని టీఆర్ఎస్(TRS) విమర్శిస్తోంది. కేంద్ర అనుసరిస్తున్న ఇటువంటి అసంబద్ధ విషయాలను ఇటు రాష్ట్ర ప్రజల దృష్టికి అటు దేశ ప్రజల దృష్టికి తీసుకువస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఇందులో భాగంగానే డిసెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు(Assembly Sessions) నిర్వహించి.. ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించి చర్చించాలని నిర్ణయించింది.