తెలంగాణ అంగన్వాడీలకు వేసవి సెలవులు, మే 1 నుంచి నెల రోజులు హాలీడేస్-telangana anganwadi summer holidays announced one month vacation from may 1st ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ అంగన్వాడీలకు వేసవి సెలవులు, మే 1 నుంచి నెల రోజులు హాలీడేస్

తెలంగాణ అంగన్వాడీలకు వేసవి సెలవులు, మే 1 నుంచి నెల రోజులు హాలీడేస్

తెలంగాణ అంగన్వాడీ చిన్నారులకు సెలవులు ప్రకటించారు. మంత్రి సీతక్క చొరవతో మే 1 నుంచి నెల రోజుల పాటు చిన్నారులకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

తెలంగాణ అంగన్వాడీలకు వేసవి సెలవులు, మే 1 నుంచి నెల రోజులు హాలీడేస్

తెలంగాణలోని అంగన్వాడీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అంగన్వాడీ చిన్నారులకు నెల రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు, అంగ‌న్వాడీ యూనియ‌న్ల విజ్ఞప్తి మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం సెల‌వులు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.

మే 1 నుంచి సెలవులు

మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ క‌మిష‌న‌రేట్ లో అంగ‌న్వాడీ యూనియ‌న్లు, అధికారులతో డైరెక్టర్ కాంతి వెస్లీ సమావేశం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా మే 1 నుంచి నెల రోజుల పాటు అంగన్వాడీలకు సెల‌వులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంగ‌న్వాడీ ల‌బ్దిదారుల‌కు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంగ‌న్వాడీ చిన్నారుల‌కు, గ‌ర్భిణుల‌కు, బాలింత‌ల‌కు టేక్ హోం రేష‌న్ ద్వారా గుడ్లు, స‌రకుల‌ స‌ర‌ఫ‌రా చేయాలని ఆదేశించారు.

చరిత్రలో తొలిసారిగా

అయితే వేసవి సెల‌వుల్లో అంగ‌న్వాడీ టీచ‌ర్లకు ఇతర విధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను డైరెక్టర్ ఆదేశించారు. ఇంటింటి స‌ర్వే, అంగ‌న్వాడీలో చేర్చే చిన్నారులను గుర్తించే విధుల‌ను నిర్వర్తించాల‌ని టీచ‌ర్లను ఆదేశించారు. సాధారణంగా అంగ‌న్వాడీలకు వేసవి సెలవులు ఉండవు. అంగ‌న్వాడీల‌కు సెల‌వులు ప్రకటించడంలో చొర‌వ చూపిన మంత్రి సీత‌క్కకు అంగ‌న్వాడీ యూనియ‌న్లు కృత‌జ్ఞత‌లు తెలిపాయి. చరిత్రలో తొలిసారి అంగన్వాడీలకు సెలవులు ప్రకటించారని సిబ్బంది అంటున్నారు.

ఏపీలో అంగన్వాడీ చిన్నారులకు పాలపొడి

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గిరిజన ప్రాంతాల్లో రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గిరిజన, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గిరిజల ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా రూ.వెయ్యి కోట్లతో మారుమూల గూడేలకు రోడ్లు వేస్తున్నామన్నారు.

1,600 గ్రామాలకు కొత్తగా తాగునీటి సౌకర్యం కల్పించామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు టెట్రా పాల ప్యాకెట్‌కు బదులుగా పాలపొడి అందించేందుకు పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించేందుకు రెండు ఐసీడీఎస్‌ క్లస్టర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి

తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు మిగతా ప్రాంతాలలో కూడా పాలపొడి అందిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీలు, ఆర్వో ప్లాంట్లు, తాగునీరు ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.156 కోట్లు కేటాయించామన్నారు. వేసవి సెలవులు ముగిసేలోగా ఈ పనులను పూర్తిచేస్తామన్నారు.

విద్యార్థులకు కాస్మెటిక్‌ ఛార్జీలకు బదులుగా గిరిజన సహకార సంస్థ ద్వారా వివిధ వస్తువులతో కూడిన కిట్‌ లు అందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్‌ఎంలను నియమిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం