TS MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరం
తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలోనే పోటీ చేయనుంది. రెండు స్థానాలు ఎన్నికలు జరుగనుండగా ఉపాధ్యాయ స్థానానికి జరిగే ఎన్నికలకు మాత్రమే బీజేపీ పరిమితం కానుంది.
TS MLC Elections తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మాత్రమే బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
హైదరాబాద్ స్థానిక సంస్థలకు పోటీ చేసే విషయంలో నిర్ణయాన్ని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి పార్టీ అప్పగించింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఎంఐఎం అభ్యర్ధి నామినేషన్ వేశారు. హైాదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో పోటీ చేసే విషయంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధికి టిఆర్ఎస్ మద్దతు ఇవ్వడంతో ఓ దశలో బీజేపీ కూడా పోటీ చేయాలని భావించారు. నామినేషన్ల ఘట్టం గురువారంతో తుది దశకు చేరడంతో బీజేపీ అభ్యర్ధి నామినేషన్ వేయడంపై ఉత్కంఠ నెలకొంది. చివరి నిమిషంలో బీజేపీ పోటీ చేయకూడదని నిర్ణయించడంతో ఉత్కంఠకు తెరపడింది.
హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 118 ఓట్లు ఉన్నాయి. వీటిలో ఎంఐఎం పార్టీకి 52 ఓట్లు, బిఆర్ఎస్కు 41 ఓట్ల బలముంది. బీజేపీకి 25 ఓట్లు ఉన్నాయి. 60 ఓట్లు వచ్చిన వారికి గెలుపు అవకాశం ఉంటుంది. బీజేపీ నేతల్లో ఏకాభిప్రాయం రాకపోవడం, పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి చేరిన ఏపీ బీజేపీ పంచాయితీ….
ఏపీ బీజేపీని వివాదాలు వీడటం లేదు. పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మురళీధరన్తో అసంతృప్త నేతలు భేటీ కానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై పలువరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పంచాయితీ ఢిల్లీకి చేరింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి అసంతృప్త నేతలంతా ఢిల్లీ చేరుకున్నారు. మురళీధరన్ నివాసంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి నుంచి మూడు వరకు సమావేశం జరుగనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లక్ష్యంగా ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల జిల్లాల్లో కన్నా వర్గం మొత్తాన్ని తొలగించడంపై ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలోని పలు జిల్లాల నుంచి నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాం కిషోర్తో పాటు టెక్కలి నుంచి భాస్కర్, కృష్ణాజిల్లా నుంచి కుమార స్వామి, శ్రీకాకుళం, ఒంగోలు జిల్లాల నుంచి అసంతృప్త నాయకులు ఢిల్లీ చేరుకున్నారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పురందేశ్వరి, సత్యకుమార్ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. కష్టపడి పనిచేసే వారిని పక్కన పెట్టి కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారని తన వ్యతిరేక వర్గాన్ని ఇబ్బంది పెట్టేలా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి బీజేపీ నేతలు విజయవాడలో సమావేశం పెట్టుకోవాలని భావించినా, అలా చేస్తే పార్టీకి చేటు కలుగుతుందని పార్టీ పెద్దలు వారించడంతో, అసంతృప్త నేతలంతా ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర వ్యవహారాలను చక్కబెట్టే లక్ష్యంతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్