ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేస్తారా.. సీఎం వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు ఫైర్-teachers unions are outraged over cm revanth reddy comments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేస్తారా.. సీఎం వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు ఫైర్

ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేస్తారా.. సీఎం వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు ఫైర్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ సంఘాల తీరుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కామెంట్స్‌పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేస్తారా అని ప్రశ్నించాయి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. బజారున పడేయటం సమంజసం కాదని స్పష్టం చేశాయి.

రేవంత్ రెడ్డి (CMO)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేయడం విచారకరమని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కుటుంబం అంటూనే ఉద్యోగులను బజారున పడేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాయి. టీఎస్‌టీయూఎఫ్, టీఆర్‌టీఎఫ్, ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ వేర్వేరు ప్రకటనల్లో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలను ఖండించాయి.

అడగడంలో తప్పేముంది..

'అక్టోబర్ 24న జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం సమస్యలన్నీ విన్నారు. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తామని చెప్పారు. ఆర్థికపరమైన అంశాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. ఆరు నెలలు గడుస్తున్నా ఉపసంఘం సమావేశమే జరగలేదు. రాజ్యాంగబద్ధంగా పొందాల్సిన ప్రాథమిక హక్కును ఉద్యోగులు అదనంగా, అనవసరంగా అడుగుతున్నారన్నట్టుగా సీఎం వ్యాఖ్యలున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, దాచుకున్న జీపీఎఫ్‌ డబ్బులు, పదవీ విరమణ పొందిన తర్వాత దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అడగడంలో తప్పేముంది?' అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నించాయి.

సీఎం ఏమన్నారు..

'ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? ఎందుకు మీ సమరం.. గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? ప్రతీ నెలా రూ.7వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు.. మనమంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎవరిపై సమరం..

'ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు.. సమరం అని అంటుండ్రు. ఎవరిపై సమరం.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్న.. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందాం. మనం సమరం చేయడానికి ఇక్కడ లేము. ప్రజలకు సేవచేయడానికే ఇక్కడ ఉన్నాం. ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లు బాగుపడినవారు ఎవరూ లేరు' అని రేవంత్ స్పష్టం చేశారు.

పావులుగా మారొద్దు..

'ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే.. ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడంలేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది.. నన్ను కోసినా.. వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేను' అని సీఎం తేల్చిచెప్పారు.

సంబంధిత కథనం