Warangal Crime : వరంగల్ లో వ్యభిచార గృహంపై రైడ్ - నిర్వాహకురాలితో పాటు విటులు అరెస్ట్-task force raids on a brothel house in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Crime : వరంగల్ లో వ్యభిచార గృహంపై రైడ్ - నిర్వాహకురాలితో పాటు విటులు అరెస్ట్

Warangal Crime : వరంగల్ లో వ్యభిచార గృహంపై రైడ్ - నిర్వాహకురాలితో పాటు విటులు అరెస్ట్

HT Telugu Desk HT Telugu

వరంగల్ లో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. నిర్వాహకురాలితో పాటు విటులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు స్మార్ట్ ఫోన్లు, రూ.2,450 నగదు, కండోమ్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ రైడ్ (istockphoto.com)

వరంగల్ నగరంలో కొంతకాలంగా వ్యభిచార దందా సాగుతోంది. నిరుపేద మహిళలను టార్గెట్ చేసి వరంగల్ కు తీసుకు రావడం ఆ తరువాత వ్యభిచారం రొంపిలోకి దింపి బిజినెస్ చేయడం కామనైపోయింది. ఇలా ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి నడిపిస్తున్న వ్యభిచార గృహంపై మంగళవారం రాత్రి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేపట్టి వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులను అరెస్ట్ చేశారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…..

హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాశపల్లికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని పోస్టల్ కాలనీలో వ్యభిచార గృహం నడిపిస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేదల మహిళలను తీసుకు వచ్చి వారితో చీకటి దందా సాగిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి సమీపంలోని గూడురు, హైదరాబాద్ రామాంతపూర్ కు చెందిన ఇద్దరు మహిళలను వరంగల్ కు తీసుకొచ్చింది. వారితో వ్యభిచారం నిర్వహిస్తుండగా.. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.

ఐదుగురు అరెస్ట్…..

నగరంలో వ్యభిచారం జరుగుతున్న విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే పోస్టల్ కాలనీలోని వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. ఈ మేరకు నిర్వాహకురాలితోపాటు జనగామ జిల్లా కేంద్రానికి చెందిన బత్తిని అశోక్, గుండ్లగడ్డ ప్రాంతానికి చెందిన బుక్క కరుణాకర్, స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన వడ్లకొండ రమేశ్, కాజీపేట విష్ణుపురికి చెందిన బొల్లి శ్రీనివాస్ అనే నలుగురు విటులను పట్టుకున్నారు. వారి నుంచి ఐదు స్మార్ట్ ఫోన్లు, రూ.2,450 నగదు, కండోమ్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిర్వాహకురాలు, నలుగురు విటులతో పాటు ఇద్దరు బాధిత మహిళలను తదుపరి విచారణ నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించారు. కాగా వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ సీఐ సార్ల రాజు, ఎస్సై భాను ప్రకాశ్, మహిళా ఏఎస్సై రాజేశ్వరి, కానిస్టేబుల్స్ సురేశ్, సురేందర్, సాంబరాజు, ఇతర సిబ్బందిని టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ అభినందించారు. ఇదిలాఉంటే వ్యభిచార గృహం నడిపిస్తున్న మహిళ గతంలో కూడా ఇదే దందా సాగిస్తూ పోలీసులకు పట్టు బడింది. ఆ తరువాత జైలుకు వెళ్లి వచ్చిన ఆమె మళ్లీ అదే దందా మొదలు పెట్టింది. వ్యభిచార గృహ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్లు మళ్లీ ఇదే దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పీడీ యాక్టులు పెడతాం: ఏసీపీ

నగరంలో ఎవరైనా ఆర్గనైజ్డ్ గా ఏర్పడి మహిళలతో వ్యభిచార దందా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. వ్యభిచారాన్నే వృత్తిగా ఎంచుకుని రూములు, ఇళ్లు తీసుకుని దందా చేస్తే ఊరుకోబోమన్నారు. ఈ దందాకు పాల్పడుతూ పదే పదే పట్టుబడిన నిర్వాహకులపై పీడీ యాక్టులు అమలు చేస్తామని ఏసీపీ మధుసూదన్ హెచ్చరించారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).