NTR Jayanthi: ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ నివాళులు అర్పించారు. ఉదయాన్ని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న సోదరులు ఎన్టీఆర్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు.
తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకులు అన్న ఎన్టీఆర్. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు పిలుపునిచ్చారు.
అందరికి కూడు, గుడ్డ, గూడును అందించిన మహనీయులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. జయంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిస్తున్నాం.
తెలుగు ప్రజల ఆత్మబంధువు అన్న ఎన్టీఆర్...ఎన్టీఆర్ జయంతి సందర్బంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ సందేశం విడుదల చేశారు.
తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి...అన్న ఎన్టీఆర్ అని ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామన్నారు.
క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని చంద్రబాబు కొనియాడారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్...తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారన్నారు.
సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని, ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారని, పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం...ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.