Bhadradri District : భద్రాద్రి జిల్లాలో నలుగురు మావోయిస్టు దళ సభ్యుల లొంగుబాటు
Bhadradri Kothagudem District News: భద్రాద్రి జిల్లాలో నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. వీరికి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసులు వెల్లడించారు.
Bhadradri Kothagudem District News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 141bn, 81bn సిఆర్పిఎఫ్, CRPF దక్షిణ మండల రేంజ్ ఫీల్డ్ టీం సమక్షంలో శుక్రవారం నలుగురు మావోయిస్ట్(Maoist) దళ సభ్యులు లొంగిపోయారు. భద్రాద్రి (Bhadradri Kothagudem)పోలీసులు చేపట్టిన "ఆపరేషన్ చేయూత" ఇటీవల కాలంలో సత్ఫలితాలను ఇస్తోంది. దీంతో భద్రాద్రి పోలీసులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబ సభ్యులకు సైతం కౌన్సిలింగ్ ఇస్తూ వారు తిరిగి జనజీవన శ్రవంతిలో కలిసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పని చేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం "ఆపరేషన్ చేయూత" ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పని చేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకుని తమ ఉనికి కోసం, స్వార్ధ ప్రయోజనాల కోసం వారిచేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని తెలిపారు. తద్వారా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకొని అభివృద్ధి నిరోధకులుగా మావోయిస్టులు వ్యవహారిస్తున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు, కారణాల వల్ల కుటుంబాలను వదిలేసి తెలిసీ తెలియక మావోయిస్టు పార్టీలోకి వెళ్లి చాలా మంది అమాయకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది వారి జీవితాలను ఫణంగా పెడుతున్నారన్నారు. వారందరూ తిరిగి జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లా నుంచి నిషేధిత సిపిఐ పార్టీలో పని చేస్తున్న దళ సభ్యులంతా లొంగిపోయి ప్రభుత్వం నుంచి వారికి అందే అన్ని రకాల ప్రతిఫలాలను పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
నలుగురు దళ సభ్యుల లొంగుబాటు..
1).చర్ల మండలం బూరుగుపాడుకి చెందిన వంజం దేవా, 2).కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపెల్లి రాజ్ కుమార్@రంజిత్, 3). ఛత్తీస్ గడ్ సుకుమా జిల్లాకు, జేగురుగొండ మండలం తిమ్మాపూర్ కు చెందిన సోడి గంగా@అశోక్ మరియు 4).సుకుమా జిల్లా డోకుపాడు గ్రామానికి చెందిన కల్మదేవేలు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక, మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల వేధింపులు తట్టుకోలేక పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు.
గతంలో లింగిపోయిన దళ సభ్యులకు రివార్డులు..
ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన దళసభ్యులైన 1.మడివి కృష్ణ, ఎర్రం పాడు గ్రామం, చర్ల మండలం (04లక్షలు), 2.పూణేo ఆడమయ్య, అడవి రామవరం గ్రామం గుండాల మండలం (లక్ష రూపాయలు, 3. వెట్టి బీమా,పెంటపాడు గ్రామం, చింతగుప్ప, సుకుమా జిల్లాకి లక్ష రూపాయల నగదును జిల్లా ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పని చేస్తున్న వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.
చర్ల పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ రూమ్..
"మేము సైతం" కార్యక్రమంలో భాగంగా చర్ల మండలంలోని వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేందుకు సుమారుగా చర్ల పోలీసు వారికి రూ.9,50,000 అందజేశారు. నేరాల నియంత్రణ కోసం చర్ల మండలంలో మొత్తం 54 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చర్ల పోలీస్ స్టేషన్లో వీటికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ చేతుల మీదుగా ఈ కమాన్ కంట్రోల్ ను ప్రారభించారు. నేరాల నియంత్రణలో భాగంగా తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో పాత్ర వహించిన చర్ల మండల వ్యాపారస్తులకు, ప్రజలకు ఈ సందర్బంగా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.