MLAs Poaching Case : ఎమ్మెల్యేల ఎర కేసు.. ఫిబ్రవరి 27కు వాయిదా-supreme court hearing postponed february 27th over mla purchase case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Supreme Court Hearing Postponed February 27th Over Mla Purchase Case

MLAs Poaching Case : ఎమ్మెల్యేల ఎర కేసు.. ఫిబ్రవరి 27కు వాయిదా

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 02:55 PM IST

MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే.... కేసుకి సంబంధించి కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం పర్యవేక్షణలోని సీబీఐ సంస్థ బీజేపీపై ఎలా విచారణ చేస్తుందని ప్రశ్నించారు.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

MLAs Poaching Case : ఎమ్మెల్యేల ఎర కేసును ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర (MLAs Poaching Case) కేసుని సీబీఐకి అప్పగించాలనే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును (Supreme Court) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీర్పుపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో... ఫిబ్రవరి 8న విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.... హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. తదుపరి విచారణ ఈ రోజు (ఫిబ్రవరి 17న) జరిగింది. అయితే... కేసు ఆలస్యంగా విచారణ జాబితాలో చేరడంతో.... తక్కువ వ్యవధిలోనే వాదనలు ముగించిన సుప్రీం కోర్టు... విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ కేసులో... ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే... బీజేపీ తరపున సీనియర్ అడ్వకేట్ రామ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. కేసుని సీబీఐకి ఇవ్వాలన్న హైకోర్టు తీర్పుని కొట్టివేయాలని విజ్ఞప్తి చేసిన దుష్యంత్ దవే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించిందన్నారు. నిందితులపై నమోదైన కేసులు తీవ్రమైనవిగా పేర్కొన్నారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న రామ్ జెఠ్మలానీ.... కేసు వివరాలను, ఆధారాలను సీఎం స్వయంగా మీడియాకు లీక్ చేశారని అన్నారు. ఆ వివరాలను తమకూ పంపించారని జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన దుష్యంత్ దవే.... సీబీఐ, ఈడీ కూడా ప్రతిరోజు లీకులు ఇస్తున్నాయని తెలిపారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుకి సంబంధించి కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని... దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకి తెలిపారు. కేసుకి సంబంధించి తమ వద్ద ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రం పర్యవేక్షణలోని సీబీఐ సంస్థ బీజేపీపై ఎలా విచారణ చేస్తుందని ప్రశ్నించారు. కేసుని సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం ఏముందని... రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ సమర్థవంతంగా విచారణ చేస్తుందని తెలిపారు. ఇరువురి వాదనలు నమోదు చేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం... కేసు విచారణను ఫిబ్రవరి 27న చేపట్టనున్నట్లు ప్రకటించింది.

మరోవైపు.. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(Special Investigation Team) ఇప్పటి వరకూ సేకరించిన ఆధారాలు, ఇతర వివరాలు, కేసు ఫైళ్ల కోసం సీబీఐ ఎదురుచూస్తోంది. కేసుని సీబీఐకి అప్పగించడంపై సుప్రీంకోర్టులో స్పష్టత వచ్చిన తర్వాత... ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

IPL_Entry_Point