సుంకిశాల ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇంటేక్ వెల్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని పర్యవేక్షిస్తున్నారు. సకాలంలో పనులను పూర్తి చేయటం ద్వారా… హైదరాబాద్ కు తాగు నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని భావిస్తున్నారు.
నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని ఇటీవలే జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు. జలమండలి ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇంటేక్ వెల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. ప్రాజెక్టు పైపు లైన్ పనుల్ని పరిశీలించారు. పైపు విస్తరణ పనులలో ప్రత్యేక దృష్టి సారించాలని ఏజెన్సీ అధికారులకు సూచించారు. నాణ్యత లో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.
ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపు లైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వీటిలో టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. సివిల్ వర్క్స్ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రిటైనింగ్ వాల్ శిధిలాల తొలగింపు పనులు శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సుంకిశాల టన్నెల్ గేట్ రిటైనింగ్ వాల్ ఓ పక్కకు ఒరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. శిథిలాల తొలగింపు పురోగతిని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ శిథిలాల తొలగింపు పనులలో వేగం పెంచాలని సూచించారు. అలాగే పునర్ నిర్మాణం సంబంధించిన డిజైన్ లు వెంటనే సమర్పించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. టైం లైన్ ర్దేశించుకుని పనులను పురోగతిని సమీక్షించుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శిథిలాలను తొలగించడానికి పంపు రూమ్ పై ఉపరితలంలో ప్రత్యేకంగా రోప్ వేని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ల ద్వారా సిమెంట్ శిథిలాలను వేగంగా తొలగిస్తున్నారు. వర్షాలు రాకముందే టన్నెల్ ప్లగ్గింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు రెండు షిఫ్టుల్లో పనులను చేపట్టాలని యోచిస్తున్నారు.
ప్రతి ఇంటేక్ టన్నెల్ వద్ద రిజర్వాయర్ వైపు గేట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా రిటైనింగ్ వాల్ పై ఒత్తిడి తగ్గించుకోవడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. గేట్ తో పాటు స్క్రీన్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. వర్షా కాలంలో వరద సమయంలో చెట్లు ఇతర వస్తువులు కొట్టుకొని వచ్చే అవకాశాలు ఉంటాయని, ఈ స్క్రీన్ల తో వాటిని అడ్డుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
సాధారణంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజీలో 131 టీఎంసీలు, 510 అడుగుల నీరు ఉన్నంత వరకు నీటిని వాడుకునే వెసులుబాటు ఉంటుంది. వేసవిలోనూ తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం సుంకిశాల ఇంటేక్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. నాగార్జున సాగర్ లో జలాలు డెడ్ స్టోరేజికి పడిపోయినా.. ఈ ప్రాజెక్టు ద్వారా నగరానికి తాగునీరు అందించవచ్చు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులు గత 2023 వేసవి కాలం నాటికే పూర్తై హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించాలి. కోదండాపూర్ నీటి శుద్ది కేంద్రానికి సుంకిశాల నుంచి నీటిని తీసుకుని, ప్రస్తుతం ఉన్న పైప్ లైన్ల ద్వారానే నీటిని అందివ్వాల్సి ఉంది. సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు సుమారు పది కిలోమీటర్లకు పైగా నిడివిలో మూడు వరసల పైప్ లైన్ అంటే 35 కిలోమీటర్ల నిడివిలో నిర్మాణం పూర్తి కావొచ్చాయి.
సాగర్ జలాశయం నుంచి తీసుకునే నీటి కోసం మూడు సొరంగాల నిర్మాణం చేపట్టారు. సొరంగాల ద్వారా వచ్చే నీటిని తోడిపోయడానికి ఇన్ టైక్ వెల్ నిర్మించి అక్కడి నుంచి ఎత్తిపోయాల్సి ఉంది. కానీ కొద్దిరోజుల కిందట జరిగిన సంఘటనలో సుంకిశాల ఇన్ టేక్ వెల్ని ర్మాణంలో రక్షణ గోడ (రిటెయినింగ్ వాల్ ) కూలిపోయింది. దీంతో సర్జ్ పూల్పూర్తిగా నీటితో నిండిపోయింది. ప్రస్తుతం సాగర్ లో నీటిమట్టం తగ్గిపోవటంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి.
సంబంధిత కథనం