Kakatiya University :ప్రక్షాళన దిశగా కాకతీయ యూనివర్సిటీ! అడ్మినిస్ట్రేషన్​ లో భారీ మార్పులు-steps are being taken towards making major changes in the kakatiya university administration ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kakatiya University :ప్రక్షాళన దిశగా కాకతీయ యూనివర్సిటీ! అడ్మినిస్ట్రేషన్​ లో భారీ మార్పులు

Kakatiya University :ప్రక్షాళన దిశగా కాకతీయ యూనివర్సిటీ! అడ్మినిస్ట్రేషన్​ లో భారీ మార్పులు

HT Telugu Desk HT Telugu

Warangal Kakatiya University News: గత కొద్దిరోజులుగా కాకతీయ వర్శిటీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం రావటంతో… వర్శిటీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా… అడ్మినిస్ట్రేషన్ లో భారీగా మార్పులు చేయనున్నారు.

ప్రక్షాళన దిశగా కాకతీయ యూనివర్సిటీ!

Warangal Kakatiya University News: కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద వివాదం తెరమీదకు వచ్చినా.. కనీస చర్యలు చేపట్టని వర్సిటీ పాలకులు తాజాగా మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. మొన్నటికి మొన్న పాల బిల్లు క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేస్తూ ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కగా.. ఆయనను వీసీ సస్పెండ్ చేసేశారు. ఎప్పటినుంచో రిటైర్డ్ ప్రొఫెసర్ రిజిస్ట్రార్ గా కొనసాగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తినప్పటికీ లైట్ తీసుకున్న వర్సిటీ పాలకులు బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో భారీ మార్పులు చేపట్టారు. రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న రిటైర్డ్ ప్రొఫెసర్ కు ఉద్వాసన పలకడంతో పాటు వివిధ విభాగాల్లోనూ మార్పులు చేశారు. దీంతో కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎట్టకేలకు అడ్మినిస్ట్రేషన్ లో మార్పులు

తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ యాక్ట్ సెక్షన్ 15.1 ప్రకారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా రెగ్యులర్ ప్రొఫెసర్లనే నియమించాలి. అంటే రిటైర్డ్ అయి పెన్షన్ తీసుకునే ప్రొఫెసర్లు అర్హులు కారన్నమాట. అయినా కేయూలో ఆ రూల్ కు విరుద్ధంగా దాదాపు ఏడాదిన్నర కిందట వీసీ తాటికొండ రమేశ్ రిటైర్డ్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావును రిజిస్ట్రార్ గా నియమించడం వివాదాస్పదమైంది. దీంతో పలుమార్లు విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టి, రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న రిటైర్డ్ ప్రొఫెసర్ ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. అయినా గత ప్రభుత్వ పెద్దల సహకారంతో వీసీ రమేశ్ రిజిస్ట్రార్ గా శ్రీనివాసరావునే కొనసాగిస్తూ వచ్చారు. ఇదిలాఉంటే ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలుండటం, వీసీ రమేశ్ కు పదవీ గండం పొంచి ఉందనే ప్రచారం జరగడంతో ఎట్టకేలకు ఆయన మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. దీంతో బుధవారం అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రిటైర్డ్ ప్రొఫెసర్ ను రిజిస్ట్రార్ పదవీ నుంచి తొలగించడం గమనార్హం.

కొత్త రిజిస్ట్రార్ గా మల్లారెడ్డి

వర్సిటీలో మార్పులు చేపట్టిన వీసీ రమేశ్ బుధవారం పలువురి పోస్టులు మార్చారు. ఇందులో ప్రధానంగా దూరవిద్యాకేంద్రం డైరెక్టర్గా, వర్సిటీ రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న రిటైర్డ్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావును ఆ పదవి నుంచి తొలగించారు. తిరిగి ఆ స్థానంలో వర్సిటీలో నాలుగు కీలక పోస్టుల బాధ్యతలు మోస్తున్న ప్రొఫెసర్ మల్లారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు బుధవారం సాయంత్రమే ప్రొఫెసర్ మల్లారెడ్డి నూతన రిజిస్ట్రార్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ గా ప్రొఫెసర్ వి.రామచంద్రంను నియమించారు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల కో ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ గా ఉన్న మల్లారెడ్డి రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానంలో ప్రొఫెసర్ ఎం.సదానందంకు పోస్టింగ్ ఇచ్చారు. ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ గా ప్రొఫెసర్ ఎస్.నరసింహచారి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ పి.అమరవేణిని నియమించారు. సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, యూనివర్సిటీ వ్యాయమ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ ప్రసాద్ ను నియమిస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు.

సెల్ఫ్ డిఫెన్స్ లో వీసీ

రాష్ట్రంలో ఉస్మానియా తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు వివాదాలకు అడ్డాగా మారింది. వీసీ ఏకపక్ష ధోరణితోనే వర్సిటీ అప్రతిష్టపాలవుతోందనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రూమ్ మేట్ కావడంతోనే వీసీగా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ ను నియమించారనే ఆరోపణలుండగా.. కొందరు ఇదే విషయమై కోర్టుకు వెళ్లడంతో దానిపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోగా.. మరోసారి వీసీగా కొనసాగుతాననే ధీమాతో ఉన్న వీసీ రమేశ్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పదవీకాలం దగ్గర పడుతున్న సమయంలో కొత్తగా అడ్మినిస్ట్రేషన్ లో మార్పులకు శ్రీకారం చుట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి కీలక విభాగాల్లో మార్పులు చేయడం కూడా వర్సిటీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలాఉంటే కాకతీయ యూనివర్సిటీ ఇప్పటికే వివాదాల్లో చిక్కుకోవడం, యూజీసీ కూడా ఇక్కడి వ్యవహారాలపై ఫోకస్ పెట్టడంతోనే వీసీ చర్యలకు ఉపక్రమించారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్పులు జరిగాయనే ప్రచారం ఉండగా.. వీసీ మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతారో.. లేదా షరా మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తారో చూడాలి.

రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి.

సంబంధిత కథనం