నేరస్తులను గుర్తించడానికి రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ.. దేశంలో తొలిసారి తెలంగాణలోనే అమలు చేస్తున్న పోలీసులు-state implements new technology to identify criminals telangana police first in the nation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నేరస్తులను గుర్తించడానికి రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ.. దేశంలో తొలిసారి తెలంగాణలోనే అమలు చేస్తున్న పోలీసులు

నేరస్తులను గుర్తించడానికి రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ.. దేశంలో తొలిసారి తెలంగాణలోనే అమలు చేస్తున్న పోలీసులు

HT Telugu Desk HT Telugu

రాష్ట్రంలో పెరిగిపోతున్న నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరస్తులను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని అప్ గ్రేడ్ చేస్తూ కొత్తగా ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ (ఏఎంఎఫ్పీఐ) సిస్టంను అందుబాటులోకి తెచ్చింది.

వరంగల్‌ పోలీసులకు అందుబాటులో ఆధునిక ఫింగర్ ప్రింట్‌ గుర్తింపు వ్యవస్థ

దేశంలోనే తొలిసారి తెలంగాణ పోలీసులు నేరస్తుల్ని గుర్తించడానికి కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. క్రిమినల్స్‌ను గుర్తించేందుకు ఆటోమెటేడ్‌ మల్టీ మోడల్ ఫింగర్ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఆధునిక సాంకేతిక వ్యవస్థతో నేరస్తులను సులభంగా, వేగంగా గుర్తించవచ్చని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ విధానాన్ని మొదట పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో కొన్ని సెలెక్టెడ్ స్టేషన్లలో అమలు చేశారు. అది సక్సెస్ కావడంతో విడతల వారీగా అన్ని స్టేషన్లలో వినియోగంలోకి తెచ్చేలా కసరత్తు చేస్తున్నారు.

ఏమిటీ ఏఎంఎఫ్పీఐ సిస్టం

రాష్ట్రంలో దొంగతనాలు, మర్డర్లు, దాడులు.. ఇలా వివిధ రకాల నేరాలు జరిగినప్పుడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఫింగర్ ప్రింట్స్ సేకరించేవారు. ఆల్రెడీ వారి వద్ద భద్రపరిచి ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో వాటిని సరిపోల్చి చూసేవారు.

కొన్ని సందర్భాల్లో నిందితులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతోనే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ (ఏఎంఎఫ్పీఐ) సిస్టంను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ తో పాటు ఇక నుంచి ఐరిస్‌, ఫేస్, ఫుట్ ప్రింట్స్ (పాద ముద్రలు) కూడా సేకరించి ప్రత్యేక డేటాబేస్ లో భద్రపరుస్తారు.

రాష్ట్రంలో ఎక్కడైనా రాబరీలు, హత్యలు, ఇతర అఘాయిత్యాలు జరిగినప్పుడు నేర పరిశోధనలో భాగంగా అనుమానితుల ఫింగర్ ప్రింట్స్, ఐరిస్, ఫేస్, ఫుట్ ప్రింట్స్ ను సేకరించి, డేటా బేస్ లో ఉన్న ప్రింట్స్ తో పోల్చి చూస్తారు. దీంతో నేర పరిశోధనతో పాటు నిందితులను గుర్తించడం ఈజీ అవుతుందని పోలీసులు చెబుతున్నారు.

దేశంలోనే తొలిసారి

ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ (ఏఎంఎఫ్పీఐ) సిస్టం దేశంలో ఎక్కడా అమలులో లేదు. పారిస్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుండగా, అదే తీరుగా తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగాన్ని అప్ గ్రేడ్ చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

అక్కడ నేరస్తులను గుర్తించేందుకు ఈ సిస్టం ఎంతగానో ఉపయోగపడుతుండగా, దేశంలో తొలిసారి తెలంగాణలో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు తెలంగాణలో మొదట నాలుగు స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ సిస్టంను అమలు చేశారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ లో రెండు స్టేషన్లు, సిద్దిపేట కమిషనరేట్ లో ఒకటి, వరంగల్ కమిషనరేట్ లోని హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఈ సిస్టంను అమలు చేసి పరీక్షించారు.

ముందుగా ఆయా స్టేషన్ల సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అనంతరం వారు వివిధ నేరాలు జరిగినప్పుడు ఈ ఏఎంఎఫ్పీఐ సిస్టంను వినియోగించి సక్సెస్ అయ్యారు. దీంతో ఈ సిస్టంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.

వరంగల్ లో తొమ్మిది స్టేషన్లు

తెలంగాణ పోలీసులు ఈ ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు స్టేషన్లలో ఈ విధానం సక్సెస్ కాగా.. ఇప్పుడు విడత వారీగా రాష్ట్రమంతటా ఈ సిస్టంను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఫస్ట్ ఫేజ్ లో భాగంగా వరంగల్ కమిషనరేట్ లోని తొమ్మిది స్టేషన్లలో ఈ సిస్టంను వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఆరు స్టేషన్లు, ఈస్ట్ జోన్ లో రెండు, వెస్ట్ జోన్ లో ఒక స్టేషన్ ను ఎంపిక చేసి, మొదట వాటిలో వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ ఫింగర్ ప్రింట్ వింగ్ నుంచి ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టంకు సంబంధించిన పరికరాలు వరంగల్ కమిషనరేట్ కు చేరుకోగా.. వాటిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సంబంధిత ఫింగర్ ప్రింట్ విభాగం సిబ్బందికి గురువారం సాయంత్రం అందజేశారు.

ఇప్పటికే వరంగల్ కమిషనరేట్ సిబ్బందికి ఈ సిస్టంపై పూర్తిస్థాయిలో శిక్షణ అందించామని, ఇకపై నేరస్తులను పట్టుకోవడం మరింత సులువు అవుతుందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు,

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం