తెలుగు న్యూస్ / తెలంగాణ /
Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా..! దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
అధునాతన హంగులతో సిద్దమైన చర్లపల్లి రైల్ టెర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. తదుపరి ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు 430 కోట్ల రూపాయలతో ఈ టెర్నినల్ నిర్మాణం చేశారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. రైల్వేశాఖ నిర్ణయించిన తేదీ ప్రకారం… డిసెంబర్ 28న ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు ఏర్పాటు కూడా సిద్ధం చేయగా.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు తెలిపింది. తదుపరి ప్రారంభోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ప్రకటించింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంతాప దినాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే… రైల్వే టెర్నినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్నో ప్రత్యేకతలు....
- దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో చర్లపల్లి టెర్మినల్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు.
- ఇక్కడ ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు.
- ఇక్కడ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు ఎంఎంటీఎస్ ప్లాట్ఫాంలతో కలిపి 9 ప్లాట్ఫాంలు, 2 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు.
- చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
- ప్రస్తుతం చర్లపల్లి 26 రైళ్లు ఆగుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా కృష్ణా ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, కాగజ్నగర్ ఇంటర్సిటీ, మిర్యాలగూడ ఎక్స్ప్రెస్, పుష్-పుల్, శబరి ఎక్స్ప్రెస్, శాతవాహన, కాకతీయ ఎక్స్ప్రెస్, లింగంపల్లి, రేపల్లె ప్యాసింజర్, ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి.
- చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గనుంది. అయితే.. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం అయిన తర్వాత స్టేషన్కు చేరుకునే మార్గంలో.. రోడ్ల విస్తరణ చేపట్టి ప్రజారవాణాను మెరుగుపరచాలనే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితే.. ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
- హైదరాబాద్కు తూర్పున చర్లపల్లి టెర్మినల్ను నిర్మించారు. దీనికి దగ్గర్లోనే ఘట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఉంది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్కు చేరుకునే అవకాశం ఉందని.. అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం