Vande Bharat Inspections : వందేభారత్లో జిఎం తనిఖీలు…..
Vande Bharat Inspections తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవేశపెట్టిన తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళుతున్న రైల్లో ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం త్వరలో మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో భారతీయ రైల్వేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎనిమిది కోచ్లతో నాలుగైదు గంటల ప్రయాణ దూరాలకు కొత్త రైళ్లను వినియోగించనున్నారు.
Vande Bharat Inspections దేశీయ రైలు ప్రయాణాలను కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ప్రవేశపెట్టిన వందే భారత్ రైలులో రైల్వే ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్కుమార్ గుప్తాతో కలిసి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు ఈ రైల్లో ప్రయాణించారు. ప్రయాణికులకు రైలులో కల్పించిన సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు సేవలు అందిస్తున్న సేవలపై ఆన్బోర్డు సిబ్బందితో మాట్లాడారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం వందేభారత్ ఇంజిన్లోకి వెళ్లి ట్రాక్, రైలు వేగాన్ని సైతం పరిశీలించారు. సెక్షన్ సిగ్నలింగ్, ట్రాక్ సామర్థ్యాలనూ గమనించారు.
ట్రెండింగ్ వార్తలు
తనిఖీలో భాగంగా జనరల్ మేనేజర్ విజయవాడ నుంచి సికింద్రాబాద్కు వందేభారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారు . ప్రయాణీకులతో సంభాషించారు . భారతీయ రైల్వే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన సెమీ-హై స్పీడ్ రైలు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల అనుభవం గురించి అలాగే వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు . రైలులో ప్రీమియం ఫీచర్లతో తమకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రైల్వేలు చేస్తున్న ప్రయత్నాలను ప్రయాణికులు అభినందించారు .
జనరల్ మేనేజర్ రైలులోని ఆన్-బోర్డు సిబ్బందితో సంభాషించారు . అలాగే రైలులో భద్రతా సౌకర్యాలు, క్యాటరింగ్ ఏర్పాట్లు మరియు ప్రయాణీకులకు అందించే ఆహారం యొక్క నాణ్యతను పరిశీలించారు . అనంతరం ఖమ్మం-వరంగల్ స్టేషన్ల మధ్య జనరల్ మేనేజర్ రైలు ఇంజిన్ లో ప్రయాణిస్తూ ట్రాక్ ను పరిశీలించారు . సెమీ హైస్పీడ్ రైళ్లలో లోకో పైలట్లు, ఇతర సిబ్బంది అనుసరిస్తున్న భద్రతా విధానాలను కూడా ఆయన పరిశీలించారు. సెక్షన్ యొక్క సిగ్నల్ వ్యవస్థను మరియు ట్రాక్ సామర్థ్యాన్ని కుడా జనరల్ మేనేజర్ పరిశీలించారు .
త్వరలో మినీ వందే భారత్ రైళ్లు….
మరోవైపు సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను విస్తరించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. వందే భారత్ రైళ్లలో స్వల్ప శ్రేణి రైళ్లను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎనిమిది కోచ్లతో 'మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్' రైళ్లను ఈ ఏడాది మార్చి- ఏప్రిల్ నెలల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
వందే భారత్ కొత్త సిరీస్ రైళ్లకు సంబంధించిన డిజైన్ తుది దశలో ఉన్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నా రైల్వే శాఖ నుంచి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎనిమిది వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి ప్రముఖ నగరాల సేవలందిస్తున్నాయి
మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మాత్రం అమృత్సర్-జమ్మూ, కాన్పూర్-ఝాన్సీ, జలంధర్-లుథియానా, కోయంబత్తూరు-మదురై, నాగ్పూర్-పుణె వంటి 2టైర్ నగరాల్లో కేవలం 4-5గంటల పాటు సమయం పట్టే తక్కువ దూరాలను కవర్ చేసేలా నడిపూ అవకాశం ఉంది.
మరోవైపు బెర్తులు ఉండే వందేభారత్ రైళ్లను గంటకు 220 కి.మీ. వేగంతో ప్రయాణించగలిగేలా రూపొందిస్తామని, వాస్తవంగా అవి పట్టాలపై 200 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నట్టుగా వార్తలు వచ్చాయి. ప్రయాణికులు కూర్చునేలా ఛైర్కార్ మాత్రమే ఉండే వందేభారత్ రైళ్లు, శతాబ్ది ఎక్స్ప్రెస్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని భావిస్తున్నారు.
బెర్తులు ఉండే వందే భారత్ రైళ్లు.. రాజధాని ఎక్స్ప్రెస్లకు బదులుగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 75 వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వేశాఖ ప్రణాళికలు వేసింది. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 400 రైళ్లు నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది.