Rythu Bandhu To Maharashtra Farmers : మహారాష్ట్ర రైతులకు తెలంగాణ రైతుబంధు, బీమా
Rythu Bandhu and Bheema To Maharashtra Farmers : కొంతమంది మహారాష్ట్ర రైతులకు తెలంగాణ రైతుబంధు, రైతు బీమా అందుతోంది. తెలంగాణ సరిహద్దుల్లో భూములు ఉన్నవారికి ఇది వర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ(Telangana) సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలలో తమ భూముల కోసం పలువురు మహారాష్ట్ర రైతులు(Maharashtra Farmers) తెలంగాణ రైతు బంధు(Rythu bandhu), రైతు బీమా(Rythu bheema) ప్రయోజనాలను పొందుతున్నారు. వారే బీఆర్ఎస్(BRS) విస్తరణ కోసం మహారాష్ట్రలో ఉపయోగపడనున్నారు. తెలంగాణ సంక్షేమ పథకాల లబ్ధిదారులు వీటిని అక్కడ చెప్పుకొంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఆ రాష్ట్రంలోనూ ఎంతో కొంత మైలేజీ కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహారాష్ట్రలో BRS విస్తరించేందుకు తీవ్రప్రయత్నాలు జరుగుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఇటీవల చనిపోయిన రైతు కుటుంబానికి రైతు బీమా కింద రూ.5 లక్షలు అందాయి. ఒక మహిళా రైతు భర్త సాయినాథ్ (నామినీగా) ఇటీవల భార్య అనారోగ్యంతో మరణించడంతో రైతు భీమా కింద రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా పొందారని డెక్కన్ క్రానికల్ తన కథనంలో పేర్కొంది. సాయినాథ్ మహారాష్ట్రలోని భోకర్ తాలూకాలోని రాతి గ్రామానికి చెందినవాడు.
తెలంగాణ(Telangana)లోని థానూరు మండలం రాతి గ్రామానికి చెందిన కొందరు రైతులు సరిహద్దు గ్రామాలలో రైతుబంధు, రైతు భీమా పొందుతున్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా సరిహద్దులో ఉన్న తానూర్ మండలంలో తమ భూములకు ఇప్పటికే తెలంగాణ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని పలువురు రైతులు అంటున్నారు. వారినే బీఆర్ఎస్ నాయకులు ముందంజలో ఉంచుతున్నారు. తెలంగాణ నుంచి అందుతున్న పథకాల గురించి.. అక్కడ వివరించాలని చెబుతున్నారు.
బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన సర్పంచ్లను పార్టీలోకి చేర్చుకోవడంపై దృష్టి సారించారు. కొత్త పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆ గ్రామాల్లో తమకు పట్టు ఉంటుందని నేతలు భావిస్తున్నారు.
నాందేడ్ సమావేశంలో ధర్మాబాద్ పరిధిలోని 50 మంది సిట్టింగ్ సర్పంచ్లు, కిన్వట్, శివుని, హిమాయత్నగర్, కినిగె, అప్పారావుపేట, భోకర్ ప్రాంతాలకు చెందిన వివిధ గ్రామాలకు చెందిన 100 మంది స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు కేసీఆర్(KCR) సమక్షంలో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను మహారాష్ట్ర రైతులు కొందరు పొందుతున్నారని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అంగీకరించారని డెక్కన్ క్రానికల్ పేర్కొంది. బీఆర్ఎస్ను మహారాష్ట్రకు విస్తరించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ నాయకుడు, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ రాతి గ్రామానికి చెందిన దాదాపు 25 మంది రైతులు వ్యవసాయ భూములు కొనుగోలు చేశారని, కొందరు మహారాష్ట్ర రైతులకు ఇప్పటికే తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో భూములు ఉన్నాయని తెలిపారు. ఇటీవలే జరిపిన సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. రాతి గ్రామం తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని చివరి గ్రామమైన భెల్తరోడ నుండి 3 కి.మీ దూరంలో ఉంది.