TSPSC Paper Leak : రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్స్..!
TSPSC Paper Leakage : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. వరుసగా నాలుగో రోజు విచారణ చేసింది. పలు కీలక ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ(TSPSC Paper Leak)లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగోరోజు నిందితులను విచారించిన అధికారులు పలు కీలక విషయాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది. పరీక్ష రాసిన గోపాల్, నీలేశ్ సోదరుడు రాజేంద్రనాయక్ డబ్బులు సమకూర్చినట్టుగా గుర్తించారు. మేడ్చల్ లో పనిచేసే కానిస్టేబుల్ ద్వారా మరికొంత డబ్బు ఇప్పించినట్టుగా తెలుస్తోంది. నీలేశ్, గోపాల్ పరీక్ష రాశారు. పేపర్ ఇచ్చినందుకు గానూ.. రూ.14 లక్షలు సమకూర్చారని తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
లీకేజీ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. నిందితులు ఆరు రోజుల కస్టడీలో ఉన్నారు. నాలుగో రోజు సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. మూడో రోజు విచారణలోనూ.. కీలక విషయాలను తెలుసుకున్నారు అధికారులు. ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి యాక్సెస్ చేసిన కంప్యూటర్లను పరిశీలించారు. ప్రశ్నపత్రం కాపీ చేసిన విధానం మీద ఆరా తీశారు.
బడంగ్ పేటలోని ప్రవీణ్ ఇంట్లో సోమవారం సిట్ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. మణికొండలోని రాజశేఖర్ రెడ్డి ఇంట్లో సోదాల సమయంలో మరికొన్ని ప్రశ్నపత్రాలను సిట్ స్వాధీనం చేసుకుందని సమాచారం. గ్రూప్ 1 ప్రిలిమ్స్(Group 1 Prelims) పేపర్ లీకేజీకి సంబంధించి.. నిందితుడు రాజశేఖర్ కీలక పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. క్వశ్చన్ పేపర్స్ కమిషన్ కు చేరాయని తెలిశాక.. రాజశేఖర్ అలర్ట్ అయ్యాడు. కంప్యూటర్లకు మరమ్మత్తులు, సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసినట్టుగా తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే.. కాన్ఫిడెన్షియల్ సూపరింటెండ్ శంకర్ లక్ష్మి కంప్యూటర్ ను అనువుగా.. మలుచుకున్నట్టుగా గుర్తించారు. మెుదట విఫలమై.. ఆ తర్వాత ప్రశ్నపత్రాలు కాపీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
శంకర్ లక్ష్మిని సిట్ అధికారులు ప్రశ్నించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లోని సిస్టం పాస్ వర్డ్, యూజర్ ఐడీ రాజశేఖర్ కు ఎలా తెలుసనే విషయంపై ప్రశ్నలు కురించారు. ప్రవీణ్, రాజశేఖర్ తన దగ్గర నుంచి పాస్ వర్డ్ దొంగిలించి ఉంటారని శంకర్ లక్ష్మి చెబుతోంది. టీఎస్పీఎస్సీ(TSPSC) కార్యాలయంలో ఇప్పటికే ప్రశ్నించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. శంకర్ లక్ష్మిని సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు.
ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. నిందితులు ఫోన్ లో మాట్లాడిన వారి వివరాలు సేకరిస్తున్నారు. టీఎస్పీఎస్సీ నుంచి తీసుకొచ్చిన కంప్యూటర్లను సైబర్ క్రైమ్ పోలీసులు విశ్లేషిస్తున్నారు.