SIT Investigation : సూత్రదారులు సిట్ ముందుకు వస్తారా…?
SIT Investigation ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక సూత్రదారులుగా భావిస్తున్న నలుగురు నిందితులు సిట్ ముందుకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభపెట్టారనే అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో దర్యాప్తుపై ఉత్కంఠ నెలకొంది.
ల్SIT Investigation టిాఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేందుకు ప్రలోభ పెట్టారని అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని సిట్ విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విచారణలో ఏం తేలుతుందనేది ఉత్కంఠగా మారింది. బీజేపీ-టీఆర్ఎష్ పార్టీల మధ్య కాకరేపుతున్న ఈ వ్యవహారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్ సంతోష్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే అంచనాలున్నాయి. బిఎల్ లక్ష్మణ్తో పాటు నలుగురు అనుమానితులు సోమవారం సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
బీజేపీలో కీలక నాయకుడిగా భావిస్తున్న సంతోష్తో పాటు కేరళలోని కొచ్చిలో ఉన్న అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యుడిగా పనిచేస్తున్న డా.జగ్గుస్వామి, కేరళాలోని భారత్ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్ వెల్లాపల్లి, న్యాయవాది శ్రీనివాస్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సిఆర్పిసి ప్రకారం నోటీసులు జారీ చేయడంతో నలుగురు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యేలకు ఎర ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అనుమానితుల్ని విచారిస్తే అసలు విషయాలు బయట పడొచ్చని అంచనా వేస్తున్నారు. వీరిని విచారిస్తే ఈ వ్యవహారంలో మరిన్ని రహస్యాలు బయటపడతాయని బావిస్తున్నారు. అనారోగ్యం, ఇతరత్రా ముందస్తు కార్యక్రమాలుంటే తప్ప నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీల్లో కీలక నాయకుడిగా ఉన్న బీఎల్ సంతోష్ విచారణను ఎదుర్కోవాల్సి రావడం రాజకీయంగా రెండు పార్టీల మధ్య వేడి పెంచుతోంది. అనుమానితులకు చట్టప్రకారం రక్షణ కావాలి అనుకుంటే అందుకు న్యాయ స్థానాల నుంచి తగిన ఉపశమనం పొందాల్సి ఉంటుంది. ఈ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేయవద్దని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. విచారణకు హాజరు కావాలని కోర్టు సూచించడంతో వారు ఎగువ కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.
అసలు సూత్రధారులు ఎవరని అరా…
టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను పార్టీ మారేలా ప్రోత్సహించారని ఆరోపణలతో అక్టోబర్ 26న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్లను తెలంగాణ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరిని విచారిస్తున్న క్రమంలో మరికొన్ని పేర్లు తెరపైకి రావడంతో వారిని కూడా ప్రశ్నించడానికి సిట్ సిద్ధమైంది. సిట్ కార్యాలయంలో నలుగురిని వేర్వేరుగా ప్రశ్నించేందుకు ప్రశ్నావళిని కూడా రెడీ చేసుకున్నారు. రామచంద్ర భారతి ఫోన్ బీజేపీ సంతోష్ పేరుతో ఉన్న కాంటాక్టుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన మెసేజీలు వెళ్లాయి. వాటిలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి టిక్కెట్ బుక్ చేసిన న్యాయవాదిని కూడా సిట్ విచారించనుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.