Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో శంకర్ మహదేవన్.. ఆయన ఛాలెంజ్ వారికే
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గాయకుడు శంకర్ మహదేవన్ మెుక్కలు నాటారు. ఈ ఛాలెంజ్ ద్వారా కొన్నేళ్లుగా ఎంతో మందిని ప్రేరేపించిన సంతోష్ కుమార్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చేందుకు హైదరాబాద్కు వచ్చారు గాయకుడు, సంగీతకారుడు శంకర్ మహదేవన్. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ, మరో స్నేహితుడు రాజుతో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు.
లక్షలాది జీవరాశుల మనుగడకు అవసరమైన ఆక్సిజన్ను మెుక్కలు అందిస్తున్నాయని శంకర్ మహదేవన్ అన్నారు. ఛాలెంజ్ ద్వారా గత కొన్నేళ్లుగా ఎంతో మందిని ప్రేరేపించిన సంతోష్ కుమార్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రజలందరూ తమ బాధ్యతగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దేవిశ్రీ ప్రసాద్, గాయని శ్రేయా ఘోషల్, ప్రముఖ వాయిద్యకారుడు శివమణిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు శంకర్ మహదేవన్.
'మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే ఆక్సిజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజసిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయి. ఒకప్పుడు కాలుష్య రహితంగా ఉన్న నగరాలన్ని నగరీకరణ ప్రభావంతో కాలుష్య ఖార్ఖానాలుగా మారిపోయాయి. కాలాలతో సంబంధం లేకుండా కాలుష్యం ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తుంది. మనం చూస్తుండగానే ఆక్సిజన్ సెంటర్స్ వచ్చాయి. ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్ తరాల పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉంది.' అని శంకర్ మహదేవన్ అన్నారు.
మనం ఎప్పుడో మేలుకొని చేయాల్సిన కార్యాన్ని ఇవ్వాల జోగినిపల్లి సంతోష్ కుమార్ తన భుజాలమీద వేసుకున్నారని శంకర్ మహదేవన్ అన్నారు. దేశమంతా మొక్కలు నాటిస్తున్నారన్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న సంతోష్ కుమార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా తమ బాధ్యతగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలన్నారు.