కర్రెగుట్టల్లో ఆరో రోజూ కూంబింగ్‌.. భారీ సొరంగం గుర్తింపు.. ఇన్నాళ్లు మావోయిస్టులు ఇక్కడే ఉన్నారా?-security forces uncover huge tunnel in karregutta as part of combing operation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కర్రెగుట్టల్లో ఆరో రోజూ కూంబింగ్‌.. భారీ సొరంగం గుర్తింపు.. ఇన్నాళ్లు మావోయిస్టులు ఇక్కడే ఉన్నారా?

కర్రెగుట్టల్లో ఆరో రోజూ కూంబింగ్‌.. భారీ సొరంగం గుర్తింపు.. ఇన్నాళ్లు మావోయిస్టులు ఇక్కడే ఉన్నారా?

కర్రెగుట్టల్లో భద్రతా దళాల కూంబింగ్‌ ఆరో రోజూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జవాన్లు భారీ సొరంగాన్ని గుర్తించారు. మావోయిస్టులు ఇన్నాళ్లు ఇక్కడే తలదాచుకున్నట్టు అనుమానిస్తున్నారు. హిడ్మా తప్పించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జవాన్లు గుర్తించిన సొరంగం

ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఆరో రోజూ కూంబింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం బ్లాక్ హిల్స్ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ గుట్టలను అన్నివైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి. దాదాపు వెయ్యి మంది వరకు తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉంది.

సొరంగం గుర్తింపు..

గుట్టలో పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న సొరంగాన్ని జవాన్లు గుర్తించారు. ఇందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. అటు ఈ గుట్టల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్‌కు గురయ్యారని, వారి పరిస్థితి విషమంగా మారుతోందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.

ఆహారం కోసం ఇబ్బందులు..

నిరంతరం జరుగుతున్న ఈ ఆపరేషన్ కారణంగా.. మావోయిస్టులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండొచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మావోయిస్టులు ప్రస్తుతం దాక్కున్న అన్ని కొండలను చుట్టుముట్టే వరకు.. ఈ ఆపరేషన్ కొనసాగించాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్‌ కొనసాగుతోంది.

పేలుడు సామాగ్రి స్వాధీనం..

ఎంతో కష్టపడి శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు.. మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు.

తప్పించుకున్న హిడ్మా..!

మరోవైపు కర్రిగుట్టల నుంచి మోస్ట్ వాంటెడ్ హిడ్మా సహా.. మావోయిస్టు దళాలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా బలగాల రాకను పసిగట్టి మకాం మార్చినట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులు తప్ప మరెవరూ చనిపోలేదని.. పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ఎండలు మండుతున్న వేళ ఆపరేషన్‌ చేపట్టిన బలగాలు కూడా నీరసించిపోతున్నాయి. రోజుల తరబడి నడకతో 100 మందికి పైగానే జవాన్లు వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురయ్యారని తెలుస్తోంది.

సంబంధిత కథనం